నాకు మా అన్నతో గొడవలు ఉంటే..: వైఎస్ షర్మిల
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట్ వద్ద భారత్ రాష్ట్ర సమితికి చెందిన స్థానిక శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరుల దాడుల తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో- పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆ తరువాత కూడా పోలీసుల అనుమతి లభించకపోవడంతో పాదయాత్రను పునరుద్ధరించడంలో జాప్యం ఏర్పడింది.

పాలేరు ఖరారు..
చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవడం, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో తన పాదయాత్రను పునఃప్రారంభించారు వైఎస్ షర్మిల. అదే సమయంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ కార్యాలయానికీ భూమిపూజ చేశారామె. ఈ నెల 16వ తేదీన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి భూమిపూజ చేశారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల- పాలేరు నుంచే పోటీ చేయనున్న విషయం తెలిసిందే.

ఏడాది సమయంలో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం కూడా లేకపోవడం వల్ల అన్ని పార్టీలు కూడా ఇక ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్- వరుసగా జిల్లా పర్యటలను చేపట్టారు. మహబూబ్ నగర్, జనగామల్లో పర్యటించారు. మహబూబాబాద్, జగిత్యాలల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్యే తన అయిదో విడత పాదయాత్రను ముగించారు. మలి విడతకు సమాయాత్తమౌతోన్నారు.

జనవరిలో..
అటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రకు పూనుకున్నారు. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పాదయాత్రను చేపట్టనున్నారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధమౌతోంది. ఇటీవలే హర్యానాలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారాయన. పాదయాత్ర సహా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి అనుసచించాల్సిన వ్యూహాలపై రాహుల్ గాంధీతో చర్చించారు.

అందరి కంటే ముందే..
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మాత్రం వారందరికీ భిన్నంగా రంగంలో ఉన్నారు. అందరి కంటే ముందే పాదయాత్రను చేపట్టారామె. ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేశారు. తనదైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శనాస్త్రాలను సంధిస్తోన్నారు. తనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తోన్న మాటల దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఎదురుదాడులకు దిగుతున్నారు.

అన్నతో గొడవలు ఉంటే..
తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఘాటుగా రిప్లై ఇచ్చారు. అన్నతో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలి గానీ.. తెలంగాణ రాజకీయాలతో వైఎస్ షర్మిలకు ఏం అవసరం ఉందంటూ కేటీఆర్ చేసిన విమర్శలను తిప్పి కొట్టారామె. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా అన్నతో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెడతాను గానీ తెలంగాణ రాజకీయాలతో తనకు అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఆ ఇంగిత జ్ఞానం తనకు కూడా ఉందని తేల్చి చెప్పారు.

ఆ మాటలో నిజం లేదు..
అన్నతో గొడవ ఉన్నాయనే మాటలో నిజం లేదు కాబట్టే తాను ఏపీలో పార్టీ పెట్టలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అన్నతో గొడవలు లేనందున తెలంగాణలో పార్టీ పెట్టానని చెప్పారు. ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం ఎవరో తెలుసా అంటూ షర్మిల ప్రశ్నించారు. తాను తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ప్రధాన కారణం- కేటీఆర్ అయ్య కేసీఆర్ అని షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ దిక్కు మాలిన పరిపాలన వల్లే తాను పార్టీ పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications