India vs Pakistan T20 World Cup 2021: మ్యాచ్ మాత్రమే కాదు..అంతకుమించి: హోమాలు మొదలయ్యాయ్
బెంగళూరు: క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులంటూ ఏవైనా జట్లు ఉన్నాయంటే అవి భారత్-పాకిస్తాన్లే. ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ను మ్యాచ్గా చూడరు అభిమానులు. అంతకు మించి.. అనే స్థాయిలో ఉంటుంది. భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే- రెండు దేశాల మధ్య ఓ యుద్ధ వాతావరణం క్రీడా మైదానంలో కనిపిస్తుంటుంది. ఈ రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజలు ఈ మ్యాచ్ పట్ల అత్యంత ఆసక్తిగా, అంతకుమించి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంటారు. తమ దేశం గెలవాలని కోరుకుంటుంటారు.
డేంజరస్ మౌంట్ కిలిమంజారోపై జెండా పాతిన టాలీవుడ్ హీరోయిన్: త్రివర్ణ పతాకంతో
మరోసారి హైఓల్టేజ్ మ్యాచ్..
అలాంటి వాతావరణమే మరోసారి ఏర్పడింది. టీ20 ప్రపంచకప్ 2021 మెగా టోర్నమెంట్లో భాగంగా భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మారింది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. టీమిండియాకు విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వాన్ని వహిస్తున్నారు.
విన్నింగ్ ప్రాబబిలిటీ ఇలా..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో టీమిండియా ఎదుర్కొంటోన్న మొట్టమొదటి మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్లోనే తన చిరకాల ప్రత్యర్థిని ఢీ కొట్టబోతోంది. విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది భారత్ వైపే ఉంది. ఈ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధిస్తుందంటూ 64 శాతం మందికి పైగా అబిమానులు అంచనా వేస్తోన్నారు. పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నది 36 శాతం మందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి టోర్నమెంట్లలో భారత్ను ఎప్పుడూ ఓడించనే లేదు పాకిస్తాన్. అది కూడా భారత్పై అంచనాలు పెరగడానికి కారణమైంది.
నాడు కేప్టెన్గా..నేడు మెంటార్గా
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ ఇప్పటిదాకా అయిదుసార్లు తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచుల్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. భారత్ గెలిచిన మ్యాచుల్లో ఒకటి- 2007 నాటి టీ20 ప్రపంచకప్ ఫైనల్. నాటి టోర్నమెంట్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ను ఓడించి మరీ ఛాంపియన్గా ఆవిర్భవించింది. మహేంద్రసింగ్ ధోనీ అప్పటి జట్టుకు కేప్టెన్గా వ్యవహరించాడు. అదే ధోనీ.. ఇప్పుడు టీమిండియా మెంటార్గా తన సేవలను అందిస్తున్నాడు. మెంటార్గా ఉన్న టీమిండియా తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్ను ఢీ కొడుతోంది.
పూజలు, హోమాలు మొదలయ్యాయ్..
భారత్-పాకిస్తాన్ ఎప్పుడు ఎదురుపడినా.. అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుకునేలా ఉంటాయి. తమ అంచనాలకు తగ్గట్టుగా టీమిండియా సత్తా చాటాలని, తిరుగులేని విజయాన్ని సాధించాలని ఆశించే అభిమాని బహుశా ఉండకపోవచ్చు. పాకిస్తాన్పై విజయాన్ని సాధించడంతో పాటు మరోసారి టీ20 ప్రపంచకప్ను గెలవాలని కోరుకుంటూ అభిమానులు ప్రత్యేక పూజలు మొదలు పెట్టారు.. హోమాలను నిర్వహిస్తున్నారు. టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రస్థానంలో ఎలాంటి విఘ్నాలు కలగకూడదంటూ ప్రార్థిస్తున్నారు.
బెంగళూరులో..
బెంగళూరు సుధామనగర్, శ్రీనివాస కాలనీలోని శ్రీ విశ్వప్రియ చంద్రమౌళీశ్వర్ స్వామివారి దేవస్థానంలో ఈ ఉదయం టీమిండియా అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. హోమాన్ని నిర్వహించారు. జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కేప్టెన్ రోహిత్ శర్మ చిత్రపటాలు, వరల్డ్ కప్, జాతీయ పతాకాన్ని ఉంచి పూజలు చేశారు. 2019లో పాకిస్తాన్పై ఘన విజయాన్ని సాధించినట్టే ఈ సారి కూడా గెలవాలని కోరుకుంటున్నారు. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడినా.. టీ20 వరల్డ్ కప్లో ఆ గండాన్ని అధిగమించాలని ప్రార్థిస్తున్నారు.
India vs Pakistan T20 World Cup 2021: మ్యాచ్ మాత్రమే కాదు..అంతకుమించి: హోమాలు మొదలయ్యాయ్#India #Pakistan #T20WorldCup pic.twitter.com/fLIqScP1DP
— oneindiatelugu (@oneindiatelugu) October 23, 2021