వారణాసిలో విషాదం: తొక్కిసలాటలో 24 మంది మృతి
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. వారణాసిలోని రాజ్ఘాట్ వంతెనపై తొక్కిసలాట చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనలో 24 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
జయగురుదేవ్ ఉత్సవంలో పాల్గొనడానికి పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. ఈ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.జై గురుదేవ్కు నివాళులు అర్పించడానికి గంగానదిపై గల రాజ్ఘాట్పైకి పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. ఇరుకు రోడ్లపైకి ఒక్కేసారి పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారని, అనుమతికి మించి వచ్చారని అధికారులు చెప్పారు.
వంతెన కూలిందనే పుకార్లు బయలు దేరడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు సాగుతున్నాయి. చెప్పులు, దుస్తులు చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మృతుల్లో 15 మంది మహిళలే కావడం గమనార్హం. తొక్కిసలాట జరిగిన వెంటనే బాధితులకు వైద్య సాయం అందించడంలో జాప్యం జరిగింది. దీంతో మరణాలు ఎక్కువ సంఖ్యలో సంభవించాయని అనుకుంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సభ ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.