ఆ జైలులో ఎయిడ్స్ కలకలం: ఏకంగా 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ దస్నా జైలులో ఎయిడ్స్ వ్యాధి కలకలం రేపుతోంది. ఈ జైలులో ఉన్న 5500 మంది ఖైదీల్లో ఏకంగా 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. అయితే, ఇటీవల ఈ జైలులోకి 250 మంది ఖైదీలు కొత్తగా వచ్చారు. వీరిలో నలుగురికి హెచ్ఐవీ పాజిటివ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు చేయగా 140 మందికి ఎయిడ్స్ సోకినట్లు తేలింది. ఈ జైలులో 2016 నుంచి హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని దస్నా జైలు ఎస్పీ అలోక్ సింగ్ వెల్లడించారు. తొలిసారి పరీక్షలు చేయగా 49 మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని గుర్తించినట్లు చెప్పారు.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే 2019 ప్రకారం జాతీయస్థాయిలో ఎయిడ్స్ వ్యాప్తి రేటు 2.5 ఉండగా, ఈ జైలులో మాత్రం 2.5 శాతం ఉండటం గమనార్హం.
జిల్లా ఆస్పత్రి వైద్యులతో ఖైదీలకు హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సింగ్ తెలిపారు. యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జైలు ఆస్పత్రిలోనే హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలకు వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
జైలులో పెద్ద సంఖ్యలో ఖైదీలు చేరడంతో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం జైలు సిబ్బందికి సవాలుగా మారిందన్నారు. ఒకరికి వాడిన ఇంజక్షన్ను మరొకరికి వాడటం వల్లే హెచ్ఐవీ పాజిటివ్ కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో మిగితా ఖైదీలు కూడా హెచ్ఐవీ బారిన పడతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.