సంచలనం: యూపీలో 48 గంటల్లో 15 ఎన్కౌంటర్లు! ఒక గ్యాంగ్స్టర్ హతం.. మరో 24 మంది అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్యాంగ్స్టర్ల భరతం పడుతున్నారు. కేవలం 48 గంటల్లో 15 ఎన్కౌంటర్లు చేసి సంచలనం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు దాదాపు 10 జిల్లాల్లో సాగిన ఈ ఎన్కౌంటర్లలో మొత్తం 24 మంది గ్యాంగ్స్టర్లను పట్టుకున్నారు. ఒక గ్యాంగ్ స్టర్ మాత్రం పోలీసుల కాల్పుల్లో మరణించాడు.
దీనికంతటికీ కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పరిపాలనలో తనదైన శైలి చూపిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి రాష్ట్రంలోని గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకోమంటూ సంచలన ఆదేశాలు జారీ చేయడం ఆ రాష్ట్ర పోలీసులకు మరింత ఊపునిచ్చింది.
ఈ ఆపరేషన్ సందర్భంగా యూపీ పోలీసులు పెద్ద ఎత్తున దేశీ, విదేశీ ఆయుధాలతో పాటు ఆ గ్యాంగ్స్టర్లు దోచుకున్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు, కార్లు, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన గ్యాంగ్స్టర్లు అందరూ 'వాంటెడ్' జాబితాలో ఉండడం, కొందరి తలలపై రూ. 15,000 నుంచి రూ. 50,000 వరకు వెల ఉండడం గమనార్హం.
యూపీలోని ప్రధాన జిల్లాలైన ముజఫరాపూర్, గోరఖ్పూర్, బులంద్ షహర్, షామిలి, హపూర్, మీరట్, షహరన్ పూర్, కాన్పూర్, లక్నో జిల్లాల పరిధిలో పోలీసులు ఈ ఎన్కౌంటర్లు నిర్వహించారు. పలుచోట్ల గ్యాంగ్స్టర్లు కాల్పులు జరపడంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది.
దీంతో ఘజియాబాద్కు చెందిన ఇంద్రపాల్ అనే గ్యాంగ్స్టర్ ప్రాణాలు కోల్పోయాడు. అతడిపై 33 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్ కౌంటర్ల సందర్భంగా పలువురు గ్యాంగ్స్టర్లకు బుల్లెట్ గాయాలు అవగా పోలీసులు వారిని వెంటనే ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
గ్యాంగ్స్టర్లను ప్రాణాలతో పట్టుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశాలతో చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ శనివారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప గ్యాంగ్స్టర్లపై నేరుగా కాల్పులు జరపవద్దని ఆదేశించామని ఆయన చెప్పారు.