ఉగ్ర బీభత్సం: 17మంది జవాన్లు మృతి, 4గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులతో విరుచుకుపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం యురి సెక్టార్లో గల సైనిక కార్యాలయంపై ఆదివారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డారు. ఉగ్ర కాల్పుల్లో 17మంది జవాన్లు మృతి చెందారు.
మరో 12మంది సైనికులు గాయపడ్డారు. అప్రమత్తమైన భారత సైన్యం దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. భారీగా మొహరించిన భద్రతా బలగాలు ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి.
కాగా, ఈ సంఘటనతో ఆర్మీ అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. అలాగే జమ్మూకాశ్మీర్ గవర్నర్, సీఎంతో కూడా ఫోన్లో రాజ్నాథ్సింగ్ మాట్లాడారు.
రాజ్ నాథ్ విదేశీ పర్యటన రద్దు
ఉగ్ర కాల్పుల నేపథ్యంలో హెలికాప్టర్ల సాయంతో పారామిలిటరీ జవాన్లను ఘటనా స్థలికి పంపారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, తన రష్యా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. యూరీ సెక్టారులో ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
మంటలంటుకోవడంతోనే మరణాల సంఖ్య పెరిగింది
సైనిక స్థావరంలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలో ఉన్నారని.. ఆ సమయంలో దాడి జరగడంతో టెంట్లకు నిప్పంటుకొని సిబ్బంది తీవ్రంగా గాయపడటంతో పాటు భారీగా ప్రాణనష్టం జరిగిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. దాదాపు 12 మంది జవాన్లు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే హెలికాప్టర్ల ద్వారా శ్రీనగర్లోని ఆస్పత్రులకు తరలించామన్నారు.
ఈ ఏడాది జరిగిన ఉగ్రదాడుల్లో ఎక్కువ సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదేనన్నారు. జనవరిలో పఠాన్కోట్ ఎయిర్బేస్పై జరిగిన దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ముందే హెచ్చరించాం: ఐబీ
యురి సెక్టార్ ప్రాంతంలో దాడులు జరిగే అవకాశముందని సెప్టెంబరు 15వ తేదీ నాడే హెచ్చరించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఏడుగురు సాయుధులైన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్లోని యురి సెక్టార్ ప్రాంతంలోప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించామన్నారు.
పలువురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో దాడులు చేయడానికి పాక్ సరిహద్దుల్లో ఆగస్టు 28 నుంచే రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశామని ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.