West Bengal: నువ్వు సింగం అయితే నేను పుష్ప- పోలింగ్ వేళ పంచ్ లు..!
పశ్చిమ బెంగాల్లో (west bengal) రెండో దశ పోలింగ్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు పరిశీలకుడిగా ఈసీ పంపిన యూపీ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ.. తనను సింగంగా అభివర్ణించుకుంటూ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల నియోజకవర్గంలో చేసిన హెచ్చరిక రాజకీయంగా ఉద్రిక్తతలకు కారణమైంది. ఆయనకు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్.. "అతను 'సింగం' (Singham) అయితే, నేను 'పుష్ప' (Pushpa) అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఖాన్ అనుచరులు ఓటరు గుర్తింపు కార్డులను సేకరిస్తున్నారని, ఓటర్లను బెదిరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం పరిశీలకుడిగా నియమితులైన యూపీకి చెందిన 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శర్మ ఫల్తాకు వెళ్లారు. శర్మ నిన్న ఖాన్ నివాసానికి చేరుకుని స్పష్టమైన హెచ్చరికలు చేశారు. ఖాన్ బంధువులతో మాట్లాడుతూ శర్మ.. అతనికి విషయం అర్థమయ్యేలా చెప్పండి, ప్రజలను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే, తాము తగిన విధంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా తప్పు చేసినా లేదా ఓటర్లను వేధించడానికి ప్రయత్నించినా, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

దీనిపై ఖాన్ ఘాటుగా స్పందించారు. ఇది బెంగాల్, అతను 'సింగం' అయితే, నేను 'పుష్ప'. ఫల్తాలో బీజేపీ మోహరించిన యూపీ పోలీసు అధికారుల నుండి ఎలాంటి బెదిరింపులు లేదా ఒత్తిడిని సహించబోమన్నారు. వారు పోలీసు బలగాలతో వచ్చి తన పైనా, తన మనుషులపైనా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. శర్మ తన కుటుంబాన్ని "బెదిరించడానికి" తన పార్టీ కార్యాలయానికి, నివాసానికి వచ్చారని ఖాన్ ఆరోపించారు. ఇది ఒక పోలీస్ అబ్జర్వర్ విధా అని ప్రశ్నించారు. అతను ఏదైనా చెప్పాలనుకుంటే, ఎస్పీకి లేదా ఐసీకి చెప్పాలి, ఒక పోలీస్ అబ్జర్వర్ ఇళ్లకు వెళ్లి ప్రజలను బెదిరించవచ్చని ఎన్నికల కమిషన్లో ఎలాంటి రూల్ లేదన్నారు.వారు గెలవలేమని తెలిసి టీఎంసీ కార్యకర్తలను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ తాము భయపడబోమన్నారు. ఆ తర్వాత సీఆర్పీఎఫ్ వాహనాలతో శర్మ కాన్వాయ్ వెళ్తుండగా.. టీఎంసీ మద్దతుదారులు జై బంగ్లా నినాదాలు చేశారు.














Click it and Unblock the Notifications