చెన్నై బీభత్సం: ఆస్పత్రిలో 18 మంది మృత్యువాత
చెన్నై: ప్రకృతి వైపరీత్యానికి తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి బీభత్సంగా ఉంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసియులో 18 రోగులు మృత్యువాత పడ్డారు. విద్యుత్తు సరఫరా లేకపోవడం, ఆక్సిజన్ అందుబాటులోకి రాకపోవడంతో వారు మృత్యువాత పడ్డారు.
చెన్నై వరదల నేపథ్యంలో ఎటిఎంలు పనిచేసేలా చూడాలని బ్యాంకులను కోరారు. మొబైల్ ఎంటి, ఎటిఎం వ్యాన్లను ఏర్పాటు చేయాలని, అవసరమైతే వాటిని పడవల మీద పెట్టాలని కోరారు. వర్షాలు ఆగిపోవడంతో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
మంగళవారం ఏ మాత్రం పనిచేయని మొబైల్ ఫోన్లు పాక్షికంగా పనిచేయడం ప్రారంభించాయి. గురువారం రాత్రి కోడంబాకమ్, టీ నగర్, తంబారం వంటి ప్రాంతాల్లో ముసురు పడింది. అయితే శుక్రవారం తెల్లవారే సరికి ఆకాశం నిర్మలంగా మారింది. ప్రజలు వీధుల్లోకి రావడం కనిపించింది.
చేంబరపక్కం, పొండి, పుఝల్ల్లోంచి నీటి ప్రవాహం విడుదల తగ్గింది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. సురక్షితమైన మంచినీరు ఇప్పుడు అమూల్యంగా మారింది. కూరగాయల ధరలు ఇంకా దిగి రాలేదు.
రవాణా సర్వీసులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విమానాలు చెన్నైలోని అరక్కోణంలో గల రాజాలి వైమానిక కేంద్రం నుంచి నడుస్తున్నాయి. చెన్నై శివారు ప్రాంతాల్లో రైలు సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు.