మేక వన్నె పులులు.. ట్రాప్లో పడ్డ యువతి.. ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడంతో ఆత్మహత్య..
ఆమె ఓ ఉన్నత కుటుంబానికి చెందిన యువతి. కాలేజీ రోజుల్లో ఓ యువకుడితో ప్రేమలో పడింది. కానీ అతను మాత్రం ఆమె ఆస్తిపై కన్నేశాడు. శారీరకంగా ఆమెను లోబర్చుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు,వీడియోలు ఆమెకు తెలియకుండా తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆపై వాటిని అడ్డుపెట్టుకుని డబ్బు కోసం డిమాండ్ చేశాడు. అలా పలుమార్లు అతను బ్లాక్మెయిల్ చేయడం.. ఆమె అడిగినంత డబ్బు ఇవ్వడం జరిగాయి. ఇంతలో రోడ్డు ప్రమాదంలో అతను తీవ్ర గాయాలపాలవడంతో అప్పటినుంచి అతని వేధింపులకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ ఉదంతం నుంచి ఏమాత్రం పాఠాలు నేర్వని ఆ అమ్మాయి.. మళ్లీ మరో మేకవన్నె పులి చేతికి చిక్కి బలైంది.
ఎవరా యువతి..
కర్ణాటకలోని గొందిచట్నహళ్లి గ్రామానికి చెందిన సుప్రియ (19) కుటుంబం ఆర్థికంగా ఉన్నత కుటుంబం. సుప్రియా పీయూసీ చదివే రోజుల్లో అదే గ్రామానికి చెందిన సాగర్ అనే వ్యక్తితో ప్రేమలో పడి మోసపోయింది. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి దగ్గరైన సాగర్.. ఆమెతో తనతో గడిపినప్పుడు రహస్యంగా ఫోటోలు,వీడియోలు తీశాడు. ఆపై వాటిని అడ్డుపెట్టుకుని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. అలా అతను అడిగిన ప్రతీసారి భారీ మొత్తంలో డబ్బు ఇచ్చేది. ఇదే క్రమంలో అతనికి యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాలపాలవడంతో.. అప్పటి నుంచి అతని బాధ తప్పింది.
సాగర్ వేధింపులకు ఫుల్ స్టాప్ పడిందనుకునే లోపే..
సాగర్ బాధ తప్పిందనకున్న కొద్దిరోజులకు... సుప్రియకు సోషల్ మీడియాలో షరీఫ్ అనే మరో యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకు అతనితో ప్రేమలో పడింది. అతను కూడా సాగర్ లాగే.. ఆమె తనతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు,వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బు కోం డిమాండ్ చేశాడు. అయితే ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా.. అతని వేధింపులు మాత్రం ఆగలేదు. విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలిసింది. పరువు పోతుందన్న భయంతో అతని వేధింపులకు వారు కూడా తలొగ్గారు. అడిగినప్పుడల్లా అతని ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ వచ్చారు.
సుప్రియ ఆత్మహత్య
షరీఫ్ వేధింపులు రోజురోజుకు తీవ్రం కావడం.. తనవల్ల తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో సుప్రియ తీవ్రంగా కలత చెందింది. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సుప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసుల అదుపులో షరీఫ్..
సుప్రియ మృతి తర్వాత షరీఫ్ శివమొగ్గ నగరంలో ఓరోజు సుప్రియ తల్లిదండ్రులకు కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకుని స్థానికుల సహాయంతో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ప్రేమ అనగానే గుడ్డిగా నమ్మేసిన సుప్రియ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.