lockdown:పోలీసులు-స్థానికులు డిష్యూం డిష్యూం, మూడు వాహనాలకు నిప్పు, 20 మందికి గాయాలు...
కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పారేస్తున్నారని పోలీసులు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. డెడ్ బాడీ తరలింపుపై ఇరువురి మధ్య ఘర్షణతో పశ్చిమబెంగాల్ అలీపుర్దువార్లో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పారేసే క్రమంలో స్థానికులు అడ్డుకునే క్రమంలో చేసిన దాడిలో 20 మంది పోలీసులు గాయపడ్డారు.
తీస్తా నదీ తీరంలో గల సల్కుమార్ హాట్ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులు వచ్చారు. అయితే వారు కరోనా వైరస్తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ప్రొక్లెయిన్తో తీసుకొచ్చారని స్థానికులు ఆరోపించారు. ఎవరూ లేని సమయం చూసి మృతదేహాన్ని పడేయాలని అధికారులు చూశారని స్థానికులు చెబుతున్నారు. అప్పటికే కాచుకాచి ఉన్న స్థానికులు.. పోలీసులను అడ్డుకున్నారు.
మాటా మాటా పెరుగగా.. పోలీసులు కాల్పులు జరుపడంతో యువకుడికి గాయమైంది. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. మూడు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. దాడిచేయడంతో పోలీసులు గాయపడ్డారు. తర్వాత జల్దాపర అడవీ గుండా తమ టీం అక్కడినుంచి వచ్చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే స్థానికులు చేసిన ఆరోపణలను ఎస్పీ ఖండించారు. పోలీసులపై దాడి చేసిన గుర్తిస్తామని పేర్కొన్నారు. వాహనాలకు నిప్పుపెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఘటనాస్థలాన్ని డీజీపీ వీరేంద్ర పరిశీలించారు. స్థానికుల దాడిలో 20 మంది గాయపడ్డారని.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అని తెలిపారు. పోలీసులపై దాడి చేయడం దురదృష్టకరం అని.. సమస్యను అధికారులకు తీసుకెళ్తే సరిపోతుంది కదా అని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 751 మందిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. సరైన కారణాలు లేకుండా బయటకొచ్చిన 14 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.