ఇతర పార్టీలను ఉడ్చేసినా టాప్ 3లో లేని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు కాంగ్రెసు, బిజెపిలను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీలో విజయం సాధించిన అభ్యర్థుల మెజారిటీతో అగ్రస్థానంలో లేరు. ఆయన టాప్-3లో చోటు దక్కించుకోలేకపోయారు. వాయువ్య ఢిల్లీ నుంచి పోటీచేసిన ఆప్ అభ్యర్థి సందీప్ కుమార్ బీజేపీ అభ్యర్థి ప్రభు దయాళ్పై 64,439 ఓట్ల భారీ తేడాతో గెలిచి మొదటిస్థానంలో ఉన్నాడు.
దక్షిణ ఢిల్లీలోని దియోలీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆప్ మరో అభ్యర్థి ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్పై 63,937 ఓట్ల తేడాతో గెలుపొంది రెండోస్థానంలో నిలిచాడు. ఆప్కే చెందిన వేద్ ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి గుజన్సింగ్పై 50,023 ఓట్ల తేడాతో గెలుపొందాడు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి నుపూర్ శర్మపై 31,583 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. వరుస ఎన్నికల విజయాలతో జోరుమీదున్న బీజేపీకి ఢిల్లీ ఎన్నికల ఫలితాల వెల్లడితో బ్రేక్ పడింది. ఆపార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
70 స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 7 స్థానాలను గెలుపొందాలి. బీజేపీ మూడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాగా కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది.