దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా: జనాభాలో సగానికి సగం మందికి: 26%: ప్రభుత్వ లెక్కల కంటే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఏ రేంజ్లో ప్రబలిపోయిందో తెలియజేసే ఉదంతం ఇది. కేంద్ర ప్రభుత్వం రోజువారీగా విడుదల చేస్తోన్న వివరాలు, ఇతర గణాంకాల కంటే అధిక సంఖ్యంలో జనం కరోనా బారిన పడ్డారని స్పష్టం చేసిన సర్వే ఇది. ప్రైవేటు ల్యాబొరేటరీ థైరోకేర్ నిర్వహించిన ఈ సర్వేలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. థైరోకేర్ సంస్థ ర్యాండమ్గా ఈ సర్వే నిర్వహించింది. దేశ జనాభాలో 26 శాతం మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడినట్లు వెల్లడించింది.

ప్రతి నలుగురిలో ఒకరు..
దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా ప్రభావానికి గురయ్యారని థైరోకేర్ తన సర్వేలో పొందుపరిచింది. యాంటీ బాడీస్ ఆధారంగా ర్యాండమ్ పద్ధతిన సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా 2,70,000 యాంటీబాడీ టెస్టులను నిర్వహించామని థైరోకేర్ సంస్థ ప్రతినిధి డాక్టర్ ఏ వేలుమణి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించామని, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, మధ్య వయస్కుల వారి యాంటీబాడీలను పరీక్షించినట్లు చెప్పారు. దీని ఆధారంగా దేశ జనాభాలో 26 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయని అన్నారు.

అంచనాలకు మించి..
వారంతా కరోనా ప్రభావానికి గురైనట్లుగా నిర్ధారించినట్లు తెలిపారు. తాము ఊహించిన అంకెలు, శాతం కంటే ఇది చాలా అధికంగా ఉన్నట్లు చెప్పారు. కరోనా వైరస్ తీవ్రతను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రాతిపదికన తీసుకుని సర్వే చేపట్టినట్లు వేలుమణి తెలిపారు. ముంబై జనాభాలో 57 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే ద్వారా వెల్లడించిందని, దాన్ని ప్రామాణికంగా తీసుకుని, అదే పద్ధతిన తాము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, నగరాల్లో అధ్యయనం కొనసాగించినట్లు చెప్పారు.

ఏడు వారాల్లో 600 నగరాల్లో
ఏడు వారాలుగా తమ సర్వే కొనసాగుతోందని వేలుమణి చెప్పారు. 600 నగరాలను దీనికోసం ఎంపిక చేశామని అన్నారు. ప్రస్తుతం ఉన్న వేగం.. దాని తీవ్రత ఇదే తరహాలో కొనసాగాల్సిన పరిస్థితే ఏర్పడితే.. డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 40 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపిస్తాయని ఆయన అంచనా వేశారు. దీన్ని నివారించడానికి తక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం.. అనుకున్న దాని కంటే అధికంగా ఉంటోందని చెప్పారు.

28 లక్షలకు పైగా..
దేశంలో 28 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. రోజూ అరలక్షకు మించి పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు కరోనా వైరస్కు హాట్స్పాట్లుగా తయారు అయ్యాయి. వేల సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీని ప్రభావం జాతీయ స్థాయి గణాంకాలపై పడుతోంది. ఒక్కరోజులో 70 వేల వరకు పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలోో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. డిసెంబర్ నాటికి 40 శాతం మంది కరోనా వైరస్ బారిన పడొచ్చని వేలుమణి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications