సీల్డ్ కవర్లో కర్ణాటక సీఎం పేరు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.
కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవ్వాళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ సమావేశానికి పరిశీలకులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు బెంగళూరుకు రానున్నారు. పార్టీ అధిష్ఠానం అందజేసిన సీల్డ్ కవర్ను వారు తమవెంట తీసుకుని రానున్నారు. ఈ సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశం సందర్భంగా సీల్డ్ కవర్ను తెరుస్తారు. కొత్త ముఖ్యమంత్రి కోసం పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిన నాయకుడి పేరును ప్రకటిస్తారు.
సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ను అపాయింట్ చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి పేరును ఈ ముగ్గురు ప్రకటిస్తారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులందరూ ఆయననే తమ సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకుంటారు.
ఈ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్లల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. 50-50 ప్రాతిపదికన ఇద్దరి పేర్లను కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదనే అంచనాలు కూడా వ్యక్తమౌతోన్నాయి. అనుభవజ్ఞుడు కావడం వల్ల కాంగ్రెస్ అధిష్ఠానం.. సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపిందంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ సస్పెన్స్కు ఈ సాయంత్రం తెరపడబోతోంది. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశానని, సిద్ధరామయ్యకు అండగా నిలిచానంటూ తాజాగా డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతోన్నాయి. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు కూడా ఆయనకు అండగా నిలుస్తానంటూ డీకే శివకుమార్ పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది.












Click it and Unblock the Notifications