ఆశ్రమంలో ఐదు శవాలు: రామ్పాల్పై దేశద్రోహం కేసు
చండీఘడ్: హర్యానాలోని బర్వాలో జిల్లాలో వివాదాస్పద స్వామీజీ రాంపాల్ ఆశ్రమంలో పడి ఉన్న ఐదు శవాలను పోలీసులకు అప్పగించారు. పోలీసులకు, వేలాది మంది రాంపాల్ మద్దతుదారులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మహిళలను, పిల్లలను కవచంగా చేసుకుని రాంపాల్ ఆశ్రమంలో తలదాచుకున్నాడు.
కాగా, రాంపాల్పై, సత్లోక్ ఆశ్రమాధికారులు, మద్దతుదారులు పలువురిపై పోలీసులు దేశద్రోహం, ఇతర అభియోగాలను మోపారు. రాంపాల్పై, ఆశ్రమ అధికార ప్రతినిధి రాజ్ కపూర్పై, కీలకమైన వ్యక్తి పురుషోత్తమ దాస్పై, మరింత మందిపై పోలీసులు మంగళవారం రాత్రి కేసులు నమోదు చేశారు.
వారిపై పోలీసులు 121 సెక్షన్ కింద, 121ఎ కింద, 122 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వంపై యుద్ధానికి ప్రయత్నించడం లేదా చేయడం, భారత ప్రభుత్వంపై యుద్ధానికి ప్రేరేపించడం, భారత ప్రభుత్వంపై యుద్ధం చేసే ఉద్దేశంతో ఆయుధాలను సేకరించడం తదితర ఆరోపణలు ఈ సెక్షన్ల కిందికి వస్తాయి.
ఆ కేసులతో పాటు నిందితులపై 123 సెక్షన్ కింద (యుద్ధం చేసే పథకానికి వీలు కల్పిస్తూ దాచుకోవడం), ఇతర అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. హత్యాప్రయత్నం, దాడి వంటి అభియోగాలు వాటిలో ఉన్నాయి. ఆయుధ చట్టం కింద కూడా అభియోగాలు మోపారు.
పోలీసులపై కాల్పులకు, పెట్రోల్ బాంబు దాడులకు పాల్పడడంతో తాజా కేసులు వారిపై పెట్టారు. కోర్టు ధిక్కరణ కింద రాంపాల్ను తమ ముందు హాజరు పరచడానికి పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రభుత్వానికి శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. అక్కడి నుంచి వెళ్లిపోయి, రాంపాల్ను అదుపులోకి తీసుకోవడానికి సహకరించాలని పోలీసులు అప్పటి నుంచి సత్లోక్ ఆశ్రమం వద్ద ఉన్న శిష్యులను కోరుతున్నారు.
పోలీసుల తీరును తప్పు పట్టిన కేంద్రం
హిస్సార్ ఘటన పైన కేంద్రం పోలీసుల తీరును తప్పుపట్టింది. పోలీసులు ఇంకాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉండేదని అభిప్రాయపడింది. రామ్ పాల్ సన్నిహితుడు పురుషోత్తంను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రామ్ పాల్ పైన దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు డీజీపీ వశిష్ట్ తెలిపారు. మొత్తం 270 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.