భారత్- చైనా సరిహద్దుల్లో జవాన్లు వీరమరణం
Ladakh: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలో భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. నదిని దాటే క్రమంలో అయిదుమంది భారత జవాన్లు అమరులు అయ్యారు. ఆకస్మికంగా సంభవించిన వరదలు దీనికి కారణమని తెలుస్తోంది. జవాన్లు వీర మరణం పొందిన విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
దౌలత్ బేగ్ ఓల్డీ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. భారత్- చైనా వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంలో ఉంటుందీ ప్రాంతం. మందిర్ మోర్ వద్ద నదిలో టీ-72 యుద్ధ ట్యాంక్తో జవాన్లు రివర్ క్రాసింగ్ ట్యాంక్ ఎక్సర్సైజ్ చేపట్టారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి అధికారి సహా నలుగురు సైనికులు ఈ ట్యాంక్లో ఉన్నారు.

ట్యాంక్ రివర్ క్రాసింగ్ ఎక్సర్సైజ్ కొనసాగుతున్నప్పుడు హఠాత్తుగా నదీ ప్రవాహ వేగం పెరిగింది. ఆకస్మికంగా వరదలు సంభవించాయి. వరద ధాటికి ట్యాంక్ కొట్టుకుపోయింది. ప్రవాహ తీవ్రతకు అదుపు తప్పింది. అంత భారీ వాహనం సైతం దిగువ కొట్టుకుపోయింది. దీనితో ట్యాంక్లో ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి అధికారి, నలుగురు జవాన్లు వీర మరణం పొందారు.
భారత్- చైనా సరిహద్దుల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం ఇది. తరచూ ఇక్కడ ఆర్మీ ఎక్సర్సైజ్లను నిర్వహిస్తుంటారు ఆర్మీ అధికారులు. 2020లో భారత జవాన్లతో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తరువాత ఇక్కడ గస్తీ మరింత పెంచారు.
తాజాగా చోటు చేసుకున్న ప్రమాదం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు. అమర జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యావత్ దేశం ఆయా కుటుంబాల వెంట ఉంటుందని ధైర్యం చెప్పారు. అయిదుమంది జవాన్లు వీర మరణం పొందడం తనను కలచి వేస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications