ముంబై ట్రైన్ పేలుళ్లు: 5గురికి మరణ శిక్ష ఖరారు, వీరే
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై 7/11 వరుస బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో మోకా ప్రత్యేక కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించింది. ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ముంబై రైళ్లలో వరుసగా చోటు చేసుకున్న బాంబు పేలుళ్లకు సంబంధించి మొత్తం 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నేరాభియోగాల అనంతరం సుదీర్ఘ కాలం పాటు విచారణ చేపట్టిన ముంబై కోర్టు 12 మందిని ఈ నెల 11న దోషులుగా తేల్చింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కేసులో తుది తీర్పును బుధవారం ప్రత్యేక కోర్టు జడ్జి వై షిండే వెలువరించారు. మరణశిక్ష పడిన నిందుతుల్లో కమల్ అన్సారీ, పైజల్ షైక్, ఎస్తేషామ్ సిద్ధిఖీ, నవేద్ హుస్సేన్, ఆసిఫ్ బషీర్ ఖాన్లు ఉన్నారు.
జీవిత ఖైదు పడిన వారిలో తన్వీర్ అహ్మద్ అన్సారీ (37), మహ్మద్ మాజిద్ షఫీ (32), షేక్ ఆలం షేక్ (41), మహ్మద్ సాజిద్ అన్సారీ (34), మజ్జమిల్ షేక్ (27), సోహిల్ మెహమూద్ షేక్ (43), జమీర్ అహ్మద్ షేఖ్ (36)లు ఉన్నారు. మోకా కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు ప్రకటించారు.
తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2006 జులై 11న ముంబై సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్ర వాదులు వరుస పేలుళ్లు జరిపారు. ఈ బాంబు పేలుళ్ల ఘటనలో 189 మంది చనిపోగా, 800 మంది వరకు గాయపడ్డారు.
ఖార్ రోడ్, బాంద్రా, మాతుంగా, మాహిమ్ జంక్షన్, జోగేశ్వరి, మీరా రోడ్, భయాందర్, బోరీవాలిల్లో 11 నిమిషాల తేడాలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు సంబంధించి ముంబై యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మరో పది మంది పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications