50 లక్షల మందికి కరోనా, 5 లక్షల మంది చిన్నారులకు కూడా: మహారాష్ట్రలో థర్డ్ వేవ్ ఇలా ఉండబోతోందా?
మహారాష్ట్ర: దేశం కరోనా సెకండ్ వేవ్లో అత్యధిక కరోనావైరస్ కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే. థర్డ్ వేవ్లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. కరోనా థర్డ్ వేవ్లో రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా ఆ మహమ్మారి బారినపడే అవకాశం ఉందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర షింగ్నే తెలిపారు.
బుల్ధానాలో శుక్రవారం మంత్రి షింగ్నే మీడియాతో మాట్లాడారు. థర్డ్ వేవ్లో 8 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందన్నారు. అంతేగాక, సుమారు ఐదు లక్షల మందికిపైగా చిన్నారులు కూడా కరోనా బారినపడే అవకాశం ఉందన్నారు. వీరిలో 2.5 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరతారని చెప్పారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలన్నింటిపైనా చర్చించామని మంత్రి షింగ్నే తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభణకు అనుగుణంగా రాష్ట్రంలో వైద్య సదుపాయాలను, మౌలిక వసతులను పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. వైద్యసిబ్బందిని కూడా సిద్దం చేస్తున్నామని చెప్పారు.
కాగా, మహారాష్ట్రలో గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు ఒకటి రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. ఆంక్షల సడలింపులు చేయడంతో జన సంచారం పెరిగి కరోనా కేసులు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మహారాష్ట్రంలో 60,17,035 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. వీటిలో 57,72,799 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,20,370 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,20,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4.1 కోట్ల నమూనాలను పరీక్షించారు












Click it and Unblock the Notifications