రైళ్లు ఢీ: 12 మంది మృతి, 45మందికి గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించారు. 45 మంది దాకా గాయపడ్డారు. లక్నో బరౌనీ ఎక్స్ప్రెస్, కృషక్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లక్నో బరౌనీకి చెందిన మూడు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం గోరఖ్పూర్ సమీపంలోని నందనగర్ వద్ద జరిగింది.
రైల్వే సహాయక బృందం సిబ్బంది, గోరఖ్పూర్ జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు జిల్లా అధికారులు చెప్పారు. ప్రమాదానికి కచ్చితమైన కారణమేమిటనేది ఇప్పటి వరకు తెలియదని అధికారులు అంటున్నారు.
కృషక్ ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ను, అసిస్టెంట్ డ్రైవర్ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదంతో గోరఖ్పూర్ - వారణాసి, లక్నో - గోరఖ్పూర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రెండు లక్షల రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించారు. గాయపడినవారికి 50 వేల రూపాయలేసి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 50 వేల రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించింది.