కొడుకు కోసం వెళ్తే తల్లిని కొట్టి చంపేశారు
పాట్నా: కన్న కుమారుడిని చుట్టు పక్కల వారు కొడుతున్నారని గుర్తించి అక్కడికి వెళ్లిన మహిళను అతి దారుణంగా కొట్టి హత్య చేసిన సంఘటన బీహార్ లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న కన్న కుమారుడి కళ్ల ముందే ఆ తల్లి ప్రాణాలు విడిచింది.
బీహార్ లోని నావాడ జిల్లాలోని కావబరి తోల అనే గ్రామంలో సుదేశ్వరీ దేవీ (60) అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈ మె కుమారుడు నిత్యం మద్యం సేవించేశాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చే సమయంలో చుట్టు పక్కల వారితో గొడవ పడేవాడు.
ప్రశ్నించిన వారిని బూతులు తిట్టేవాడు. ఈ విధంగా నిత్యం అందరితో గొడవ పడేవాడు. సుదేశ్వరీ దేవీ కుమారుడికి అనేక సార్లు బుద్ధిమాటలు చెప్పింది. అయినా అతనిలో మార్పు రాలేదు. బుధవారం రాత్రి అతను పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు.
ఇంటి సమీపంలో కుర్చుని పక్కింటి వారిని బూతులు తిట్టాడు. వారు వచ్చి అతని మీద దాడి చేశారు. విషయం గుర్తించిన సుదేశ్వరీ దేవీ కుమారుడిని రక్షించడానికి వెళ్లింది. ఆమె పైన దాడి చెయ్యడంతో సుదేశ్వరీ దేవీ అక్కడి కక్కడే మరణించారని పోలీసు అధికారి విశ్వనాథ్ ప్రసాద్ తెలిపారు.