పిడుగుపాటుకు 68 మంది బలి... యూపీలో 41 మంది... రాజస్తాన్లో 20 మంది...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగుపాటుకు చాలామంది బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆదివారం(జులై 11) 41 మంది పిడుగుపాటుతో మృతి చెందారు. ఇందులో ఒక్క ప్రయాగ్రాజ్ జిల్లాలోనే 14 మంది పిడుగుపాటుకు బలయ్యారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు,చిన్నారులే ఉన్నారు. మృతులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రయాగ్ రాజ్ జిల్లాలో 14 మంది,కాన్పూర్,ఫతేపూర్ జిల్లాల్లో ఐదుగురు చొప్పున,కౌశంబి జిల్లాలో నలుగురు చొప్పున,ఫిరోజాబాద్,ఉనావ్,రాయ్బరేలీలో ఇద్దరు చొప్పున,హర్దోయి,ఝాన్సీలో ఒక్కరు చొప్పున పిడుగుపాటుకు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. గాయపడినవారికి రూ.50వేలు పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు రాజస్తాన్లో వేర్వేరు ఘటనల్లో 20 మంది పిడుగుపాటుకు బలయ్యారు. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. జైపూర్లోని అమేర్ ప్యాలెస్ వాచ్ టవర్ వద్ద పర్యాటకులు సెల్ఫీలు దిగుతుండగా పిడుగు పడటంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. రెస్క్యూ టీం వారిని బయటకు తీసుకొచ్చి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.
Recommended Video
మధ్యప్రదేశ్లోనూ పిడుగుపాటు కారణంగా ఏడుగురు మరణించారు. యూపీ,మధ్యప్రదేశ్,రాజస్తాన్లలో మొత్తం 68 మంది పిడుగుపాటుకు బలయ్యారు. ఒక అంచనా ప్రకారం దేశంలో 2004 నుంచి పిడుగుపాటు కారణంగా ఏటా దాదాపు 2,000 మంది మరణిస్తున్నారుగ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.