ఓడిన అక్కసు: బాహాబాహి: తిట్టుకున్నారు.. చొక్కాలు చిరిగేలా మీదపడి తన్నుకున్నారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రథమ పౌరుడి ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది. కౌన్సిలర్లు పరస్పరం ఘర్షణకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు.. తోసుకున్నారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఎంపిక వ్యవహారం అంతా గందరగోళంగా తయారైంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ప్రదేశం అంతా అరుపులు, కేకలతో నిండిపోయింది.

ఎంసీడీపై ఆప్ జెండా..
గత ఏడాది నవంబర్ లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జెండా ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ 104 డివిజన్లకే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 15 సంవత్సరాల తరువాత బీజేపీ పరిపాలకు తెరపడింది.

మేయర్ ఎన్నికలో..
ఇవ్వాళ మేయర్ అభ్యర్థిని ఎంపిక ప్రక్రియను చేపట్టారు అధికారులు. మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్లను ఆమ్ ఆద్మీ పార్టీ తమ మేయర్ అభ్యర్థులుగా ప్రకటించింది. రేఖా గుప్తా బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థి రేసులో నిలిచారు. డిప్యూటీ మేయర్ రేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మహ్మద్ ఇక్బాల్, జలజ్ కుమార్, బీజేపీ తరఫున కమల్ బాగ్రీపై పోటీ పడ్డారు.

ఆప్ ను కాదని..
మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ లో తొలుత ప్రిసైడింగ్ అధికారింగా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్లను ప్రమణ స్వీకారం చేయడానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో బీజేపీకే చెందిన మరో కౌన్సిలర్ మనోజ్ శర్మ ప్రమాణ స్వీకారం చేయడానికి రాగా ఆప్ సభ్యులు అడ్డుకున్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న తమను కాదని, ప్రొటోకాల్ కు విరుద్ధంగా బీజేపీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడాన్ని తప్పుపట్టారు.

ప్రమాణ స్వీకార సమయంలో..
అంతకంటే ముందే ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సనా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం 10 మంది అల్డర్ మెన్ లను నియమించడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు సత్య శర్మను అడ్డుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోడియం వైపు దూసుకెళ్లారు.

బాహాబాహి..
బీజేపీ కౌన్సిలర్లు వారిని అడ్డుకున్నారు. పోడియం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు. దీనితో వారి మధ్య వాగ్వివాదం ఆరంభమైంది. అక్కడితో దానికి బ్రేకులు పడలేదు. ఒకరినొకరు తోసుకున్నారు. తన్నుకున్నారు. బాహాబాహికి దిగారు. బీజేపీ కౌన్సిలర్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అల్డర్ మెన్ ల నామినేట్ పై..
10 మంది ఆల్డర్ మెన్లను లెప్టినెంట్ గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ కు నామినేట్ చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే తప్పుపట్టారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన లెప్టినెంట్ గవర్నర్ కు లేఖ కూడా రాశారు. రాజ్యాంగానికి, స్థానిక సంస్థల చట్టాలకు విరుద్ధంగా లెప్టినెంట్ గవర్నర్ ఈ నియామకాలు చేశారంటూ మండిపడ్డారు. వారికి ఓటు హక్కు లేకపోయినా ఎంసీడీకి నామినేట్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications