సిటి కమిషనర్పై ఫిర్యాదు: ఐపీఎస్పై వేటు !
బెంగళూరు: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి మీద లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సుశాంత్ మహాపాత్ర మీద వేటు వెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ, హోం శాఖ కార్యదర్శి ఎస్.బి. పట్నాయక్, రాష్ట్ర డీజీపీ ఓం ప్రకాష్ లతో చర్చించారు. సుశాంత్ మహాపాత్ర వ్యవహారం గురించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య వీరితో చర్చించారు.
ప్రభుత్వ నియమాల ప్రకారం ఒక అధికారి మరో అధికారి మీద ఫిర్యాదు చెయ్యడం, బహిరంగంగా మాట్లాడటం, దర్యాప్తు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం చట్ట ప్రకారం నేరం. అయితే సుశాంత్ మహాపాత్ర సాటి ఐపీఎస్ అధికారి అయిన ఎం.ఎన్. రెడ్డి మీద లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
ఎంఎన్. రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, విచారణ చెయ్యాలని మనవి చేశారు.సుశాంత్ మహాపాత్ర సాటి సీనియర్ ఐపీఎస్ అధికారి మీద ఫిర్యాదు చేసి నియమాలు ఉల్లంఘించారని పోలీసు అధికారులు ఆరోపించారు. కర్ణాటక పోలీస్ హౌసింగ్ బోర్డు సీఎండీ అయిన సుశాంత్ మహాపాత్ర ను సస్పెండ్ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.