తరుముకొస్తోన్న ఆస్నా తుఫాన్..!!
Cyclone in Arabian Sea: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న గుజరాత్కు మరో గండం పొంచివుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో తుఫాన్గా మారబోతోంది. దీని ప్రభావంతో మహారాష్ట్ర కోస్తా, ఉత్తర ప్రాంతాలు సహా గుజరాత్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణం కేంద్రం వెల్లడించింది.
కొద్ది రోజులుగా గుజరాత్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. అక్కడి నదులన్నీ వరదపోటుకు గురయ్యాయి. పొంగిపొర్లుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అసాధారణ వర్షపాతం నమోదవుతూ వస్తోంది. పల్లె, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా జలమయం అయ్యాయి. మూడు రోజుల వ్యవధిలో 28 మంది ఈ భారీ వర్షాలకు బలి అయ్యారు.

దేవభూమి ద్వారకా, ఆరావలి, పంచ్మహల్, రాజ్కోట్, జామ్ నగర్, మహీసాగర్, పోర్బందర్, ఖేడా, అహ్మదాబాద్, మోర్బీ, జునాగఢ్, భరూచ్, వడోదర జిల్లాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వారందరినీ సహాయ, పునరావాస శిబిరాలకు తరలించారు. ఒక్క వడోదరా జిల్లాలోనే 12,000 మందికి పునరావాసం కల్పించారు.
జామ్నగర్ జిల్లాలో రంజిత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఫలితంగా అధికారులు గేట్లు ఎత్తేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తోన్నారు. అదే సమయంలో విశ్వామిత్రి నది వరద తాకిడికి గురైంది. తీర ప్రాంత ప్రాంతాలను ముంచెత్తింది. గ్రామాలన్నీ జలమయం అయ్యాయి.

ఈ పరిస్థితుల మధ్య- గుజరాత్కు తుఫాన్ ముప్పు తరుముకొస్తోంది. అరేబియా సముద్రం ఉత్తర దిక్కున ఏర్పడిన అల్పపీడనం వచ్చే ఆరు గంటల వ్యవధిలో తుఫాన్గా మారుతుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సౌరాష్ట్ర- కఛ్ మధ్య తీరాన్ని దాటుతుందని అంచనావేసింది.
భుజ్కు వాయవ్య దిశగా అరేబియా సముద్రంలో 70 కిలోమీటర్లు, నలియాకు ఈశాన్య దిక్కున 50 కిలో మీటర్లు, పాకిస్తాన్లోని కరాచీకి 250 కిలోమీటర్ల దూరంలో కెేంద్రీకృతమైంది. క్రమంగా ఇది నైరుతి దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే 48 గంటల వ్యవధిలో కఛ్ సమీపంలో తీరాన్ని తాకుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications