మత మార్పిడి ఆరోపణలు- క్రిస్మస్ వేడుకలపై దాడులు- ఉద్రిక్తత..!!
డెహ్రాడున్: దేవభూమి ఉత్తరాఖండ్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారితే క్రిస్మస్ పండగ కోసం క్రైస్తవులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడులతో కలకలం చెలరేగింది. క్రిస్మస్ వేడుకలపై అనూహ్యంగా ఈ దాడులు జరగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశి జిల్లా పురోలా గ్రామంలో చోటు చేసుకుంది. క్రిస్మస్ ఈవ్ కోసం స్థానికంగా నివసించే క్రైస్తవులు ఏర్పాట్లు చేసుకుంటోన్న సమయంలో అనూహ్యంగా కొందరు యువకులు దాడులకు పాల్పడ్డారు. 30 మందికి పైగా యువకులు కర్రలతో దాడులకు దిగారు. క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో బలవంతంగా మతమార్పిడులు చేస్తోన్నారని ఆరోపిస్తూ వారంతా క్రైస్తవులపై కర్రలతో దాడి చేశారు.
బలవంతంగా మత మార్పిడికి పాల్పడుతున్నారనే కారణంతో పాస్టర్ లాజరస్ కార్నెలియస్, ఆయన భార్య సుష్మా కార్నెలియస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో ఆరుమందిని అరెస్ట్ చేశారు. పురోలా గ్రామంలో హోప్ అండ్ లైఫ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముస్సోరీలోని యూనియన్ చర్చికి చెందిన పాస్టర్ ఈ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తోన్న సమయంలో హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని దాడులకు దిగారు.

బలవంతపు మత మార్పిడులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. గతంలో పుష్కర్ సింగ్ ధమీ సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం మత మార్పడులను నిషేధిస్తూ తీర్మానం చేసింది. అనంతరం అసెంబ్లీ- ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఇటీవలే ఆ రాష్ట్ర గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని- పురోలాలో క్రైస్తవులు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మత మార్పడి చేస్తోన్నారనే కారణంతో దాడికి దిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications