2019 రేసులో లేం: కేజ్రీవాల్, క్రేజీ రాజకీయం!
ఢిల్లీ: తమ పార్టీ 2019 ఎన్నికల కోసం ఇప్పుడే పరుగెత్తడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నాడు చెప్పారు. అలాగే, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎన్నికల వెనుక పడవద్దని సూచించారు. పంజాబ్లోని ఢిల్లీ తరహా అవకాశాలున్నాయన్నారు.
తాము ఇక్కడ అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల రేసులో ఉన్నారా అని ప్రజలు అడిగితే.. మేం ఏ ఎన్నికల రేసులో లేమనే చెబుతామన్నారు. ఢిల్లీ విజయం ఓ అద్భుతమన్నారు. మేం కష్టించి పని చేస్తున్నామని, చేయాలన్నారు. ప్రజల విశ్వాసం చూరగొనేలా పని చేయాలన్నారు.
తమవి రెండు లక్ష్యాలని ఒకటి అవినీతి అంతం, జన్ లోక్పాల్ అన్నారు. గత పదినెలలుగా తాము కష్టపడి పని చేస్తున్నామన్నారు. గత పదిహేనేళ్లలో షీలా దీక్షిత్ ప్రభుత్వం చేయలేదనిది మేం చేస్తున్నామన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే మంత్రుల పైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కేజ్రీవాల్ 'రాజకీయం'
అవినీతి లేకుండా చేయడమే తమ లక్ష్యమని రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజుల క్రితం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంలో అవినీతి ఆరోపణలుతో వేటు పడిన లాలూ ప్రసాద్ యాదవ్ను కౌగిలించుకోవడం చర్చనీయాంశమైంది.
దీనిపై కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. దీంతో, కేజ్రీవాల్ రాజకీయం బాగా నేర్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. లాలూనే తనను దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నారని, అతని అవినీతి రికార్డులను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని కేజ్రీవాల్ చెప్పారు.
అంతేకాదు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, లాలూ ఇద్దరు కొడుకులను మంత్రివర్గంలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజకీయ నేర్పరితనంతో వివరణ ఇచ్చారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.