గుజరాత్ లో కాంగ్రెస్ ను దెబ్బతీసిన ఆప్- బీజేపీకి మేలు చేసిన చీపురు పార్టీ !
ఢిల్లీ, పంజాబ్ లో వరుస విజయాల నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అరవింద్ కేజ్రివాల్ నేపథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ... ఏమాత్రం ప్రభావం చూపలేదని తేలిపోయింది. ఇవాళ వెలువడుతున్న ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఏమాత్రం బలం లేకపోయినా గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగిన ఆప్.. విపక్ష కాంగ్రెస్ అవకాశాల్ని భారీగా దెబ్బతీసినట్లు తెలుస్తోంది.
గుజరాత్ లో వరుసగా ఆరుసార్లు విజయం సాధించి ఏడో విజయంపై కన్నేసిన బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ, పంజాబ్ తరహాలో ఓటర్ బేస్ కానీ, క్షేత్రస్దాయిలో బలమైన క్యాడర్ కానీ లేకపోయినా బీజేపీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ నానా హంగామా చేసింది. ఓ దశలో బీజేపీ హిందూత్వ అజెండాకు పోటీగా పలు నినాదాల్ని కూడా తెరపైకి తెచ్చింది. నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలంటూ కొత్త డిమాండ్లు ఆప్ తెరపైకి తెచ్చింది. దీంతో ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చని భావించింది.
కానీ తానొకటి తలిస్తే అన్నట్లుగా.. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ తో పాటు ఆప్ ను కూడా నమ్మలేదు. రాష్ట్రంలో వరుసగా ఆరు ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ క్యాడర్ ను కాస్తో కూస్తో కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల స్ధాయిలో ఊపు తీసుకురావడంలో విఫలమైనా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బిజీలో ఉంటూ గుజరాత్ ఎన్నికల్ని పట్టించుకోకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా కనీసం గౌరవ ప్రదమైన సీట్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ జరిగింది వేరు. బీజేపీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు తోడు, కాంగ్రెస్ ఓటు బ్యాంకును సైతం చీల్చిన ఆప్ బీజేపీకి పరోక్షంగా భారీ సాయమే చేసింది.
గుజరాత్ లో బీజేపీతో సమానంగా అన్ని సీట్లలో పోటీ చేసిన ఆప్ తో పాటు ఇండిపెండెంట్లు, బీజేపీ బీ టీమ్ గా పేరు తెచ్చుకుంటున్న ఎంఐఎం సైతం విపక్ష ఓట్లను చీల్చుకున్నాయి. దీంతో ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పార్టీ పాతిక సీట్లు తెచ్చుకుంటే గొప్పే అన్న పరిస్ధితికి చేరిపోయింది. మరోవైపు బీజేపీ విపక్షాల విడివిడి పోటీని సొమ్ము చేసుకుంటూ చెలరేగిపోయినట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.