బాలీవుడ్ స్టార్ హీరోను వదిలి పెట్టని వైరస్: ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్కు తాత్కాలికంగా బ్రేక్
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎవ్వర్నీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రీడాకారులనే తేడాలేవీ చూపించట్లేదు. అందరిపైనా పంజా విసురుతోంది. సెకెండ్ వేవ్లోనూ పలువురు రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. హిందీ చిత్రపరిశ్రమకు చెందిన పెద్దలు వరుసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా వైరస్ సోకిందని చెప్పారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని, వెంటనే తాను హోమ్ ఐసొలేషన్కు వెళ్లానని అన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలన్నింటినీ పాటిస్తున్నానని వివరించారు. తన అభిమానులు, సినిమా ప్రేక్షకుల ఆశీర్వాదంతో త్వరలోనే తాను ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటానని చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఇదివరకు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, పరేష్ రావెల్, కార్తీక్ ఆర్యన్, రణ్బీర్ కపూర్, రోహిత్ ష్రాఫ్ వంటి బాలీవుడ్ నటులు కరోనా వైరస్ బారిన పడి, కోలుకున్న వారే.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామ్సేత మూవీలో నటిస్తున్నారు. అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్పై ఉంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచా ఇందులో లీడ్ క్యారెక్టర్లను పోషిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదలైంది. పురాతత్వ శాస్త్రవేత్తగా ఆయన నటిస్తున్నారీ మూవీలో.
కాగా- కరోనా ప్రొటోకాల్స్లో భాగంగా షూటింగ్ ప్రారంభించడానికి ముందు యూనిట్ అందరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించగా.. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్లో ఉంటున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా పట్ల ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రొటోకాల్స్ను పాటించాలని సూచించారు.