నటుడు దేవన్కు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ
తిరువనంతపురం: ప్రముఖ సినీనటుడు దేవన్ (Devan)కు భారతీయ జనతా పార్టీ (BJp) కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించింది. ఈ విషయాన్ని కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ మీడియా సమావేశంలో తెలిపారు.
కేరళకు చెందిన దేవన్ 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2021లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమత్ షా సమక్షంలోనే ఆయన కాషాయ పార్టీలో చేరారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు.

కాగా, దేవన్ మలయాళంలోనే కాక, వందలాది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి బహు భాషా చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులోనూ చాలా సినిమాలే చేశారాయన. శుభాకాంక్షలు, ఏమాయ చేశావె, మా అన్నయ్య, మౌనమేలనోయి, డమరుకం, దేశముదురు, ఖుషీ ఖుషీగా, చెన్నకేశవరెడ్డి, సారోచ్చారు, హార్ట్ ఎటాక్, సౌఖ్యం, సాహో, రాజుగారి గది లాంటి చిత్రాల్లో దేవన్ నటించారు.
కేరళ రాష్ట్రంలో జెండా ఎగురవేయాలని బీజేపీ ఎంత శ్రమించినా సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు సాధించలేకపోతోంది. పార్టీ బలోపేతానికి బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలలో ఓటు శాతాన్ని కొంత మేర పెంచుకున్నప్పటికీ.. అసెంబ్లీకి తమ అభ్యర్థులను పంపించడంలో మాత్రం సఫలీకృతం కావడం లేదు. కేరళో బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications