హీరో కమల్ హాసన్ తమిళనాడు పర్యటన ఫిక్స్, అవినీతి ప్రభుత్వంపై దండయాత్ర!
చెన్నై: రాజకీయ రంగప్రవేశంపై బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీ ప్రకటన కంటే ముందే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు విశ్వనటుడు కమల్ హాసన్ సిద్దం అయ్యారు. ప్రజలు, రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడానికి కమల్ హాసన్ రిపబ్లిక్ డే రోజు మంచి రోజు అని ఫిక్స్ అయ్యారు.

అవినీతి పరిపాలన
తమిళనాడులో ప్రస్తుతం అవినీతి పరిపాలన నడుస్తోందని, ప్రస్తుత పరిణామాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను తెలుసుకునేందుకే జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని హీరో కమల్ హాసన్ వివరించారు.

అవినీతి తిమింగలాలు
తమిళనాడు పర్యటన వివరాలను ఆనంద్ వికటన్ తమిళ పత్రిక తదుపరి సంచికలో వెల్లడిస్తా అని కమల్ హాసన్ వివరించారు. మైయామ్ విజిల్ యాప్ ద్వారా ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయని, త్వరలోనే అవినీతి తిమింగలాల బండారం బయటపెడతానని కమల్ హాసన్ హెచ్చరించారు.

జయలలిత లేరని !
జయలలిత మరణం తరువాత తమిళనాడు ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులపై కమల్ హాసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కమల్ హాసన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కమల్ వార్నింగ్ !
తాను రాజకీయాల్లోకి వచ్చి అవినీతి నాయకుల భరతం పడుతానని కమల్ హాసన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అవినీతి మంత్రుల వివరాలు సేకరించి సోషల్ మీడియాలో పెట్టాలని కమల్ హాసన్ తన అభిమానులకు ఇప్పటికే పిలుపునిచ్చారు.

అన్ని వర్గాలతో వస్తా !
తమిళనాడులోని అన్ని వర్గాలను కలుపుకుని తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు జనవరి 26వ తేదీ ముహుర్తం నిర్ణయించారు. ఇప్పటికే కమల్ హాసన్ పర్యటనకు సంబంధించి ఆయన అభిమాన సంఘాల నాయకులు రూట్ మ్యాప్ సిద్దం చేసే పనిలో నిమగ్నం అయ్యారు.












Click it and Unblock the Notifications