డిఎంకెకు నటి ఖుష్బూ రాజీనామా: గుండె బరువుతో
చెన్నై: ప్రముఖ నటి ఖుష్బూ డిఎంకెకు రాజీనామా చేశారు. ఆ మేరకు ఆమె లేఖ రాశారు. కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను గుండెబరువుతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె తన రాజీనామా లేఖలో అన్నారు.
తగిన సమయంలో కఠిన నిర్ణయాలను నవ్వుతూ తీసుకోవాలని, తాను అదే పని చేశానని, గాయపరిచే విషయాలను పట్టుకుని వేల్లాడడం సరి కాదని ఖుష్బూ అన్నారు. కరుణానిధి తనకు నాయకుడు మాత్రమే కాదు, తండ్రిలాంటివాడని ఆమె అన్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిది కుమారుడు స్టాలిన్పై గతంలో వ్యాఖ్యలు చేసి ఖుష్బూ డిఎంకె కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. ఖుష్బూ 2010లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించి డిఎంకెలో చేరారు.
బాలనటిగా 1980లో సినిమాల్లోకి ప్రవేశించారు. బర్నింగ్ ట్రెయిన్ అనే సినిమా ఆమెకు మొదటిది. తెలుగులో పలు సినిమాల్లో ఆమె నటించారు. నాగార్జున, మోహన్లాల్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ హీరోల సరసన ఆమె నటించారు.