మాకే కవర్ పంపిస్తారా- పారదర్శకత అక్కర్లేదా: కేంద్రాన్ని నిలదీసిన సీజేఐ డీవై చంద్రచూడ్..!!
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు జరిపేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం పంపించిన సీల్డ్ కవర్ ను తిరస్కరించింది.
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గౌతమ్ అదాని సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ నివేదిక అటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దుమారానికి దారి తీసింది.

దర్యాప్తునకు ససేమిరా..
ప్రతిపక్షాలు చేస్తోన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవట్లేదు. హిండన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టినప్పటికీ.. దాన్ని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోందే గానీ జేపీసీతో దర్యాప్తు జరిపించడానికి అంగీకరించట్లేదు.

సుప్రీంకోర్టు జోక్యంతో..
ఈ పరిణామాల మధ్య తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. హిండన్ బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా చేర్చారు.

సీల్డ్ కవర్ తిరస్కరణ..
హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇవ్వాళ మలిదశలో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం వాదనలను ఆలకించింది. అడ్వొకేట్ విశాల్ తివారీతో పాటు మనోహర్ లాల్ శర్మ, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలను వినిపించారు.

ఇన్వెస్టర్ల హక్కుల పరిరక్షణ కోసం..
ఇన్వెస్టర్ల హక్కులు, వారి సంపదను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుతవం సీల్డ్ కవర్ లో పంపించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. దీన్ని స్వీకరించడానికి నిరాకరించింది. కోట్లాదిమంది ఇన్వెస్టర్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల దీన్ని సీల్డ్ కవర్ లో పంపించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీన్ని తాము స్వీకరిస్తే- కేంద్రం చేసిన సూచనలను తాము అంగీకరించినట్టవుతుందని ధర్మాసనం పేర్కొంది.

పారదర్శకత అవసరం లేదా?
అదాని-హిండెన్ బర్గ్ రిపోర్ట్ వ్యవహారంలో చేపట్టిన విచారణ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. సీల్డ్ కవర్ లో పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తే అది ప్రభుత్వం నియమించిన కమిటీగా ప్రజలు భావిస్తారని వ్యాఖ్యానించారు. అందుకే తాము దీన్ని అంగీకరించట్లేదని తేల్చి చెప్పారు. నిజాన్ని చీకట్లో ఉంచడానికి తాము ఇష్టపడట్లేదని పేర్కొన్నారు.

కమిటీని మేమే నియమిస్తాం..
సీల్డ్ కవర్ లో సూచనలు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పూర్తి పారదర్శకతను పాటించనక్కర్లేదా అని ప్రశ్నించింది. ఈ రిపోర్ట్ పై విచారణ చేపట్టడానికి అవసరమైన కమిటీని తామే నియమిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు ఎవరనేది అందరికీ తెలియజేస్తామని చెప్పారు.

ఏది నమ్మమంటారు?
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక వల్ల దేశీయ షేర్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం పడలేదంటూ తుషార్ మెహతా చేసిన వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. మార్కెట్ పై ప్రభావం పడలేదని మీరు చెబుతున్నారు.. ఇన్వెస్టర్లకు చెందిన లక్షల కోట్ల రూపాయల మేర సంపద ఆవిరైందని, వారు నష్టాలను ఎదుర్కొంటోన్నారని లెక్కలు చెబుతున్నాయి..ఇందులో ఏది నిజం.. ఏది నమ్మమంటారు? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications