అలక వీడిన అద్వానీ: నరేంద్ర మోడీపై ప్రశంసలు
కోర్బా: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అలక వీడినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని అంగీకరించని అద్వానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బాలో సోమవారం మాట్లాడుతూ.. మోడీపై ప్రశంసలు కురిపించడం విశేషం.
గుజరాత్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మౌళిక సదుపాయాల కల్పన, విద్యుత్ సౌకర్యం కల్పించడంలో గుజరాత్ ముందుందని అద్వానీ అన్నారు. 2014 ఎన్నికలకు పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన నేపథ్యంలోనే ఇదంతా చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

శుక్రవారం బిజెపి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడాన్ని అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం మోడీ పేరును ప్రకటించడం రాజకీయ విపత్తు అని రాజ్నాథ్ సింగ్కి అద్వానీ తన లేఖ ద్వారా తెలిపినట్లు సమాచారం.
పార్టీ సీనియర్ నేతలందరూ బుజ్జగించినా అద్వానీ అంగీకరించలేదు. అంతేగాక మోడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని తెలిసి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి కూడా అద్వానీ హాజరు కాలేదు. ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించడం పట్ల తాను తీవ్ర అసంతృప్తికి గురైనట్లు రాజ్నాథ్కు రాసిన లేఖలో అద్వానీ పేర్కొన్నారు.
ఆ తర్వాత నరేంద్ర మోడీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. తనకు ఎల్లప్పుడూ పార్టీ అగ్రనేతలు మాజీ ప్రధాని వాజ్పేయి, అద్వానీల ఆశీస్సులుంటాయని తెలిపారు. వారి వల్లే పార్టీ దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మోడీపై ప్రశంసల వర్షం కురిపించడం ద్వారా అద్వానీ కూడా మద్దతు పలకడంతో మోడీ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు చేకూరినట్లయింది.












Click it and Unblock the Notifications