యూపీలో బీజేపీకి మరో షాక్-యోగీ సర్కార్ కు మంత్రి దారాసింగ్ గుడ్ బై-24 గంటల్లో రెండో మంత్రి
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సర్వశక్తులొడ్డుతున్న బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యోగీ ఆదిత్యనాథ్ కేబినెట్ లో మంత్రులు వరుసగా తమ పదవులకూ, బీజేపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.
నిన్న యోగీ కేబినెట్ లో కీలకమంత్రి స్వామిప్రసాద్ మౌర్య మంత్రి పదవికి, బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. ఆయనకు తోడుగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ అదే కోవలో మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ తన పదవిని వదులుకున్నారు.అలాగే బీజేపీకి కూడా గుడ్ బై చెప్పారు. దారా సింగ్ చౌహాన్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. వెనుకబడిన తరగతులు, దళితులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇవాళ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న కీలకమైన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడం గమనార్హం. ఆయన రాజీనామాతో రాష్ట్రంలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లయింది.

బీజేపీకి వరుసగా గుడ్ బై చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీతో జత కడుతున్నారు. దీంతో విపక్షంలో ఉన్న ఎస్పీకి బలం అంతకంతకూ పెరుగుతోంది. యోగీ పాలనపై వ్యతిరేకతతో పాటు రైతు ఉద్యమం సందర్భంగా బీజేపీ చేసిన తప్పిదాలు తమ కొంప ముంచుతాయని భావిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. కాషాయ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పదవులకు రాజీనామా చేసేందుకు తమదైన శైలిలో వారు కారణాలు వెతుక్కుంటున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం బీజేపీకి ఎదురుదెబ్బగా మారిపోతోంది. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది.












Click it and Unblock the Notifications