అఫ్గానిస్తాన్: అమెరికా సేనలు వెళ్లిపోయాక కాబుల్ నుంచి ఖతర్లో దిగిన తొలి విదేశీ విమానం
అమెరికా సేనల నిష్క్రమణ తరువాత కాబుల్ నుంచి బయలుదేరిన తొలి విదేశీ విమానంలో వందకు పైగా ఇతర దేశాలవారుదోహాకు చేరుకున్నారు. ఖతర్ ఎయిర్వేస్ చార్టర్డ్ విమానంలో వీరంతా కాబుల్ నుంచి బయలుదేరారు. మరో విమానం శుక్రవారం బయలుదేరుతుంది.
అమెరికా విదేశాంగ మంత్రిత ఆంటొనీ బ్లింకెన్ ఇటీవల ఖతర్ సందర్శించినప్పుడు, అఫ్గాన్ నుంచి విదేశీ పౌరుల తరలింపు విషయంలో సహాయం అందించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు.
అమెరికా సేనలకు సహాయపడిన వందలాది అఫ్గాన్లు ఇంకా అక్కడే ఉండిపోయారు. ఖతర్ విమానంలో 113 మంది ప్రయాణించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
తాలిబాన్లు దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత 1,24,000 మందికి పైగా విదేశీయులు, అఫ్గాన్ ప్రజలను ఇతర దేశాలకు తరలించారు.
- తాలిబాన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ... అమెరికాకు 'మోస్ట్ వాంటెడ్'
- తాలిబాన్ల చేతికి చిక్కిన అమెరికా అత్యాధునిక ఆయుధాలు ఇవే..
తాలిబాన్లు మమ్మల్ని తీవ్రంగా కొట్టారు - ఇద్దరు జర్నలిస్టులు
బుధవారం జరిగిన నిరసనలను కవర్ చేసిన ఇద్దరు జర్నలిస్టులు గాయాలతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.
ఆ ఇద్దరు జర్నలిస్టులను తాలిబాన్లు అరెస్టు చేసి, ఆ తర్వాత దారుణంగా కొట్టారని చెబుతున్నారు.
ఫోటోగ్రాఫర్ నెమతుల్లా నక్డి ఏఎఫ్పీ వార్తా సంస్థతో మాట్లాడారు.
"తాలిబాన్లలో ఒకరు నా తలపై కాలు పెట్టి తొక్కారు. తలపై తన్నారు. వాళ్లు నన్ను చంపేస్తారేమో అనుకున్నాను" అని ఫోటోగ్రాఫర్ నెమతుల్లా ఏఎఫ్పీ వార్తా సంస్థతో చెప్పారు.
పోలీస్ స్టేషన్ ముందు మహిళలు చేసిన నిరసనను స్థానిక ఎటిలాత్ రోజ్ వార్తాపత్రిక జర్నలిస్టు తాకీ దారీబాయ్తో కలిసి నక్ది కవర్ చేశారు.
- తాలిబాన్లు ఇకపై భారత్ దృష్టిలో తీవ్రవాదులు కారా
- పాకిస్తాన్లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
కొనసాగుతున్న మహిళల నిరసనలు
న్యాయమంత్రిత్వ శాఖ నుంచి అనుమతిలేని నిరసనలను తాలిబాన్లు నిషేధించారు.
కానీ డజన్ల కొద్ది మహిళలు, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
"మాకు స్వేచ్ఛ కావాలి" అంటూ పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల నినాదాలు చేస్తున్న నిరసనకారులను తాలిబాన్లు చెదరగొట్టారు.
పర్వాన్లో నిరసనకారులను చెదరగొట్టడానికి తాలిబాన్లు కాల్పులు కూడా జరిపారని అమాజ్ న్యూస్ పేర్కొంది.
https://twitter.com/AamajN/status/1435892158381318144
"ఆయుధాలతో ఎవరూ మా గొంతు నొక్కలేరు" అని నిరసనకారులు నినాదాలు చేశారు.
మహిళల మరో నిరసన కార్యక్రమం కాబూల్కు ఈశాన్యంగా ఉన్న కపిసా ప్రావిన్స్లో జరిగినట్లు స్థానిక మీడియా చెబుతోంది. అనేక మంది మహిళలను అరెస్టు చేసినట్లు అమాజ్ వార్తాసంస్థ పేర్కొంది.
మొత్తం పురుషులతోనే తాత్కాలిక తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, కాబుల్, ఈశాన్య ప్రావిన్స్లోని బడాఖాన్లో డజన్ల కొద్దీ మహిళలు బుధవారం తమ నిరసన తెలిపారు.
మంత్రివర్గంలోకి మహిళలను తీసుకోవాలని కొందరు మహిళలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి మహిళలపై తాలిబాన్లు దాడి చేసినట్టుగా చెబుతున్నారు.
హెరాత్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మంగళవారం ముగ్గురు మరణించారు. అయితే, వీరి మరణం వెనుక తమ హస్తం ఉన్నట్టు వస్తున్న వార్తలను తాలిబాన్లు ఖండించారు.
కాబుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి.
అనేక జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని తాలిబాన్లు ఆదేశించినట్టు టెలికాం రంగంలోని విశ్వసనీయ వర్గాలు తనతో చెప్పినట్టు అఫ్గానిస్తాన్ జర్నలిస్ట్ బిలాల్ సవారీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్, ఇంతకీ సమస్య ఎక్కడుంది?
- అఫ్గానిస్తాన్ పేరును 'ఇస్లామిక్ ఎమిరేట్స్'గా మార్చిన తాలిబాన్లు, కీలక స్థానాల్లో అతివాదులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)