షాక్: శశికళ పదవికి ఎసరు, ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన ప్రిసీడియం చెర్మన్
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను పరిగణలోకి తీసుకోరాదని కోరుతూ ఆ పార్టీ ప్రిసీడియం చెర్మన్ మధుసూదనన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మొదటి నుంచి శశికళ శిబిరంలో ఉన్న మధుసూదనన్ రాజీ పేరుతో పన్నీర్ ఇంటికి వెళ్లి చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు.
అన్నాడీఎంకే పార్టీ నియమావళి ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శి కావాలంటే ఐదేళ్లు పాటు సభ్యత్వం కలిగి ఉండాలని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో మధుసూధనన్ పేర్కొన్నారు. 2012 మార్జిలో శశికళ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని లేఖలో వివరించారు.
శశికళ పార్టీ సభ్యత్వం తీసుకుని ఇంకా ఐదేళ్లు పూర్తికాలేదని, ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్లు పరిగణలోకి తీసుకోరాదని మధుసూదనన్ ఎన్నికల సంఘానికి మనవి చేశారు. శశికళ ఎన్నిక చెల్లదని ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ ప్రిసీడియం చెర్మన్ అధికారికంగా లేఖ రాయంతో శశికళ వర్గీయులు హడలిపోయారు.