జయలలిత చికిత్స కోసం మళ్లీ ఎయిమ్స్ వైద్యులు !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు మరో సారి చెన్నై వస్తున్నారని సమాచారం. అదే విధంగా లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ సైతం మరో సారి జయలలిత ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారని సమాచారం.
ప్రఖ్యాత ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్, అపోలో వైద్యులు ఓ బృందంగా ఏర్పడి ఇంత కాలం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స చేస్తు వచ్చారు. గత నెల 22వ తేదిన జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు.
నెల రోజులకు పైగా జయలలిత పడకమీదే ఉన్నారు. ఆమె కాళ్లు, చేతులు కొద్దిగా స్వాధీనం తప్పడంతో సింగపూర్ కు చెందిన ఇద్దరు మహిళా ఫిజియోథెరఫీ వైద్యులు జయలితకు చికిత్స చేశారు.
అందరి సమిష్టి కృషి ఫలితంగా అమ్మ దాదాపు కోలుకున్నారని బుధవారం అన్నాడీఎంకే నాయకులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి పండగకు ముందే జయలలితను డిశ్చార్జ్ చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.
అయితే జయలలిత సంపూర్ణంగా కోలుకున్న తరువాత ఆమెను డిశ్చార్జ్ చెయ్యాలని, లేదంటే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
ఈ సమయంలో జయలలిత ఆరోగ్యాన్ని సమీక్షించడానికి ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు ఓ సారి చెన్నై రానున్నారని సమాచారం. గురువారం లేదా శుక్రవారం ఎయిమ్స్ వైద్యులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షించి తుది నిర్ణయం తీసుకుంటారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.
నవంబర్ 7 తరువాత తాను చెన్నై రావడం కుదరదని లండన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ చెప్పారని సమాచారం. ఇప్పటికే ఆయన గత 20 రోజుల నుంచి లండన్ చెన్నై నగరాలకు తిరుగుతూనే ఉన్నారు.
ఊరేగింపులో మళ్లీ అపసృతి
జయలలిత త్వరగా కోలుకోవాలని, తాము సంతోషంగా దీపావళి పండుగ జరుపుకోవాలని తమిళనాడులో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా సేలంలోని మారియమ్మన్ ఆలయం దగ్గర జరిగిన ఊరేగింపులో 55 ఏళ్ల గుర్తు తెలియని అన్నాడీఎంకే కార్యకర్త మరణించాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఉప ఎన్నికల వేడి: ఇన్ చార్జ్ లు
తమిళనాడులోని అరవకుర్చి, తిరుప్పరగున్రం, తంజావూరు నియెజక వర్గ ఉప ఎన్నికలకు జయలలిత ఆదేశాల మేరకు ఇన్ చార్జ్ లను నియమిస్తామని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు లోని మూడు నియోజక వర్గాలతో పాటు పుదుచ్చేరీలోని ఓ నియోజక వర్గంలో ఉప ఎన్నికల వేడి ఎక్కువ అయ్యింది.