ఎయిర్ డెక్కన్ రీఎంట్రీ అదుర్సే: రూ.1కే విమాన టికెట్!
న్యూఢిల్లీ: తక్కువ ధరకే విమానయాన సౌకర్యాన్ని కల్పించిన ఎయిర్ డెక్కన్ మరోసారి తన సేవలను అందుబాటులోకి తెస్తోంది. దేశీయ తొలి బడ్జెట్ విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ త్వరలోనే తన సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
అంతేగాక, కొందరు లక్కీ ప్రయాణికులకు రూపాయికే విమాన టికెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చౌక ధరలకే విమాన ప్రయాణాన్ని అందించేందుకు 2003లో జీఆర్ గోపీనాథ్ ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థను స్థాపించారు. 2008లో ఈ సంస్థ ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్తో విలీనమైంది.
అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2012లో ఈ సంస్థ తన సేవలను నిలిపేసింది. సుమారు ఐదేళ్ల తర్వాత మళ్లీ సేవలను పునర్ ప్రారంభించేందుకు ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు గోపీనాథ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
డిసెంబర్ నెలాఖరులో ముంబై, ఢిల్లీ, కోల్కతా, షిల్లాంగ్ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలను నడపనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22న ముంబై నుంచి నాసిక్ వరకు తొలి ఎయిర్ డెక్కన్ విమానం నడపనున్నట్లు చెప్పారు. ప్రారంభ రోజుల్లో కొందరు లక్కీ ప్రయాణికులకు కేవలం రూ.1కే విమాన టికెట్ అందించనున్నట్లు గోపీనాథ్ తెలిపారు.
కాగా, ఇటీవల కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ కన్నా తక్కువగా.. అంటే 40నిమిషాల ప్రయాణానికి కేవలం రూ. 1400 ఛార్జీ ఈ విమానయాన సంస్థ చేయనున్నట్లు తెలిసింది.