ఆమె కో-పైలట్గా వస్తేనే: ఫ్లైట్ను 2గం.ఆపేసిన పైలట్
న్యూఢిల్లీ: మహిళా కో పైలట్ కావాలని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పైలట్ పట్టుబట్టడంతో విమానం రెండు గంటలపాటు ఆలస్యమైంది. 110 మంది ప్రయాణీకులతో ఉన్న విమానాన్ని.. మహిళా కో పైలట్ కోసం పైలట్ రెండు గంటలపాటు ఆపివేయడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. తనకు నచ్చిన మహిళా పైలట్ను కో-పైలట్గా ఇవ్వలేదన్న కారణంతో మాలే నుంచి తిరువనంతపురం మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని రెండు గంటలు ఆలస్యం చేశాడు సదరు పైలట్. మొత్తం 110 మంది పాసింజర్లు విమానం ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.
సదరు మహిళా పైలట్ను కేటాయించేందుకు అధికారులకు సమయం ఇస్తూ.. తనకు బీపీ పెరిగిందని ఫిర్యాదు చేశాడు. చికిత్స పేరిట కాసేపు నాటకమాడాడు. తనకు ఆ మహిళా పైలట్నే ఇవ్వాలని రోస్టర్ సెక్షన్కు ముందే సమాచారం ఇచ్చాడట అతను.
అది కుదరదని, మహిళా పైలట్ను మరో విమానానికి కేటాయించామని చెబితే.. ససేమిరా అంటూ విమానాన్ని కదిలించేందుకు భీష్మించాడని తెలుస్తోంది. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. దీనిపై అధికారులు స్పందించవలసి ఉంది.