డ్రగ్స్ తీసుకుని విమానం నడిపిన పైలట్.. ఎయిరిండియా విమానం ఘటనపై సంచలన నివేదిక
ఫుకెట్ నుంచి దిల్లికి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర కుదుపు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానాన్ని నడిపిన పైలట్లలో ఒకరు మాదకద్రవ్యాలు వాడినట్లు పరీక్షల్లో తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ విమాన పైలట్- ఇన్- కమాండ్ సైకోయాక్టివ్ డ్రగ్స్ వినియోగించినట్లుగా డోప్ టెస్టులో తేలింది. ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక విచారణ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. విమాన సిబ్బందిలో మత్తు పదార్థాల వినియోగాన్ని అడ్డుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తగిన చర్యలు తీసుకోవాలని తగిన సిఫార్సులు చేసింది.
ఇక ఆగస్టు 4 న ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం ఏఐ 2379 లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఈ సమయంలో ఎయిర్ బస్ ఏ320-251 ఎన్ విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో కలిపి మొత్తం 145 మంది ప్రయాణిస్తున్నారు. అయితే విమానం తొలుత 372 అడుగులు పైకి వెళ్లి, ఆ తర్వాత 292 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. దిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత గాయపడిన వారికి వైద్య చికిత్స అందించారు. గాయపడ్డ 24 మందిలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. విమానం లోపల కూడా భారీగా నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పైకప్పు ప్యానెళ్లు పగిలిపోయాయన్నారు.

ఇక ఏఏఐబీ ఈ ఘటనను ప్రమాదంగా పరిగణించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా విమాన సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో పైలట్-ఇన్-కమాండ్ కు సంబంధించిన పరీక్షలో సైకోయాక్టివ్ పదార్థం వినియోగించినట్లు నిర్థారణ అయింది. అయితే భవిష్యత్తులో పైలట్లు ఇలాంటి మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఏఏఐబీ సిఫార్సు చేసింది. ఇక పైలట్ డ్రగ్స్ వాడినట్లు తేలడంతో విమానయాన రంగంలో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications