అజిత్ పవార్ మద్దతు లేఖను దుర్వినియోగం చేశారా..? అసలు లేఖలో ఏముంది..?
ముంబై: మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడితో ఇంకా మహారాష్ట్ర ప్రతిష్టంభన తొలిగిపోలేదు. అజిత్ పవార్ గవర్నర్కు ఇచ్చిన లేఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ లేఖలో ఏముంది.. ఎన్సీపీ ఏం చెబుతోంది..? కాంగ్రెస్ వాదన ఏంటి..?
అజిత్ పవార్పై బహిష్కరణ వేటు.. ధిక్కారంతో పార్టీ చర్యలు..
తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న అజిత్ పవార్
మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు మీద మలుపులు తీసుకుంటున్నాయి. తనకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. మొత్తం ఎన్సీపీలో ఎమ్మెల్యేల సంఖ్య 54గా ఉంది. అయితే అజిత్ పవార్ పార్టీకి నమ్మకద్రోహం చేశారని ఇటు శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు ధ్వజమెత్తాయి. అయితే ఎప్పుడో పాత లేఖను చూపి ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారని ఎన్సీపీ మండిపడింది. ఈ మద్దతు లేఖను గవర్నర్కు ఇచ్చి డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్సీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్వయంగా చెప్పారు.
అజిత్ పవార్ సొంత నిర్ణయం అన్న కాంగ్రెస్
అంతకుముందే అజిత్ పవార్ తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్కు లేఖ ఇచ్చారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ఎలాంటి చర్చలు లేకుండానే అజిత్ పవార్ సొంత నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అంతేకాదు ఎన్సీఎల్పీ నేతగా అజిత్ పవార్ను ఎన్నుకున్న సమయంలో ఇచ్చిన లేఖనే గవర్నర్ ముందు ఉంచారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజు వాగ్మేర్ చెప్పారు. అయితే శాసనసభలో బలనిరూపణ చేసుకోవడం బీజేపీకి అసాధ్యమని ఆయన చెప్పారు.
గవర్నర్కు ఇచ్చిన లేఖలో ఏముంది..?
ఇదిలా ఉంటే అజిత్ పవార్ గవర్నర్కు ఇచ్చిన మద్దతు లేఖలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంతకం చేసినట్లు ఉందని తెలుస్తోంది. ముందుగా కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన పార్టీల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఎన్సీపీ ఓ లెటర్ను టైప్ చేసి ఉంచారని అందులో ముఖ్యమంత్రి పేరు ఉండాల్సిన చోటును ఖాళీగా ఉంచినట్లు సమాచారం. అంతేకాదు ఎన్సీపీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో అని చెప్పే చోటును కూడా ఖాళీగా ఉంచినట్లు సమాచారం. ఈ లేఖపై ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి.
పదవి కోసం లేఖను దుర్వినియోగం చేశారు: ఎన్సీపీ
మూడు పార్టీలు ఒక ఒప్పందంకు వచ్చిన తర్వాత ఆ ఖాళీలను పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో ఎన్సీపీ ఉన్నట్లు సమాచారం. ఈ లేఖ అజిత్ పవార్ దగ్గరే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ లేఖనే అజిత్ పవార్ పదవి కోసం దుర్వినియోగం చేశారని ఎన్సీపీ ఆరోపిస్తోంది. ఖాళీగా ఉన్న చోటు తమకు అనుకూలంగా పేర్లను నింపి అధికారం చేపట్టాలని అజిత్ పవార్ భావించారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ధ్వజమెత్తారు.
ఇదిలా ఉంటే ఎన్సీపీని అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచాడని పేర్కొంటూ ఆ పార్టీ కార్యకర్తలు అజిత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రభత్వ ఏర్పాటుకు ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. మరి పరిస్థితులు ఎలాంటి టర్న్లు తీసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.