అజిత్ పవార్ కుమారుడి ఎమోషనల్ పోస్ట్ వైరల్!
మహా రాజకీయాల్లో ధ్రువతారలా వెలుగొందిన నాయకుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూయడం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విషాదం నింపింది. బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద సమయంలో ఆయన కుమారుడు జయ్ పవార్ తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆయన కుమారుడు జయ్ పవార్ హృదయాన్ని కదిలించే సందేశాన్ని పంచుకున్నారు.
'నాన్న.. మళ్లీ ఒక్కసారి నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది'
జయ్ పవార్ తన తండ్రితో కలిసి ఉన్న రెండు పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "నాన్న.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. కాలం అక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది. నిన్ను గట్టిగా హత్తుకుని ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని ఉంది. ఐ మిస్ యూ సో మచ్ నాన్న!" అంటూ రాసుకొచ్చారు. అజిత్ పవార్ ఇద్దరు కుమారులలో జయ్ పవార్ సాధారణంగా మీడియాకు దూరంగా, లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ చూసి పవార్ అభిమానులు, కార్యకర్తలు కన్నీరు పెడుతున్నారు.

రాజకీయ బాధ్యతలు చేపట్టిన సునేత్రా పవార్
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) అధినేత అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఎన్సీపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠకు తెరపడింది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అజిత్ పవార్ పర్యవేక్షించిన అబ్కారీ, క్రీడలు, మైనారిటీ సంక్షేమ శాఖల బాధ్యతలను ఆమెకే అప్పగించారు. సోమవారం సునేత్రా పవార్ కరాడ్లోని యశ్వంతరావు చవాన్ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అసలేం జరిగిందంటే?
ఓ బహిరంగ సభలో ప్రసంగించడానికి వెళ్తుండగా అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సునేత్రా పవార్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. శరద్ పవార్ నేతృత్వంలోని వర్గంతో విలీనం జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications