ఘనంగా ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం, కోడలి నోట్లో ముఖేష్ స్వీట్, ఎవరీ శ్లోకా?
ముంబై: రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నెల 24వ తేదీన గోవాలో అత్యంత వైభవంగా సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు.
డిసెంబర్లో పెళ్లి
ఆకాశ్, శ్లోకా మెహతాలు చిన్ననాటి మిత్రులు. ధీరుబాయ్ అంబానీ స్కూల్లో ఇద్దరు కలిసే చదువుకున్నారు. శ్లోకా ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ రోజీ బ్లూ డైమాండ్స్ సంస్థ అధినేత రసెల్ మెహతా కూతురు. డిసెంబర్ నెలలో వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
కోడలికి మిఠాయి తినిపించిన అంబానీ
నిశ్చితార్థ వేడుకలో అంబానీ తనకు కాబోయే కోడలికి మిఠాయీ తినిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఆకాశ్-శ్లోకా వివాహం చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే.
స్విట్జర్లాండులో పెళ్లి
అయితే ఈ విషయమై అంబానీ కుటుంబ సభ్యులు స్పందించలేదు. డిసెంబర్ నెలలో స్విట్జర్లాండ్లో ఘనంగా వివాహ వేడుక జరగనున్నట్లుగా తెలుస్తోంది.
ఎవరీ శ్లోక?
రసెల్ మెహతా కూతురైన శ్లోక లండన్లోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఎకనామిక్స్లో పట్టా పొందారు. ప్రస్తుతం తమ డైమండ్ కంపెనీలో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె కనెక్ట్ఫర్ అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు. ఇది ముంబైవాసుల సౌకర్యార్థం ఏర్పాటయిన సంస్థ. ఇక ఆకాశ్ రిలయెన్స్ రిటైల్, జియోలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు.