ఎన్నికల్లో అక్రమాలకు బీజేపీ కుట్ర.. యోగిని గద్దె దించడమే లక్ష్యం : అఖిలేష్, జయంత్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యూహ ప్రతి వ్యూహాలతో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపణలు గుప్పించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసినా ఎన్నికల్లో ఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్ కూటమి విజయాన్ని ఆపలేరన్నారు.
Recommended Video

ఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్ కూటమిదే విజయం
యూపీలో యోగి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. బీజేపీ పాలనలో సామాన్యుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయని మండిపడ్డారు. త్వరలోనే ప్రజల కలలు నెరవేర్చే ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. ఆర్ఎల్డీ, సమాజ్వాదీ సంకీర్ణ కూటమితో ములాయం, అజిత్ సింగ్, చరణ్ సింగ్ కలలను నెరవేరుస్తామన్నారు. వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ముజ్ఫర్లో అఖిలేష్ యాదవ్ , జయంత్ చౌదరి సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

హామీల జల్లు
రైతులకు వెన్నంటే ఉండేది తమ కూటమి అని అఖిలేష్ యాదవ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే బీజేపీ నల్ల సాగు చట్టాలను అమలు చేయమని చెప్పారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోళ్లు జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయి రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చెరుకు రైతుల కోసం ప్రత్యేకంగా ఓ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

యోగిపై రగిలిపోతున్న ప్రజలు
యూపీలో బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరీ విమర్శించారు. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారని అన్నారు. తమ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడేందుకు బీజేపీ కుట్ర పన్నే అవకాశం ఉందని ఆరోపించారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని చౌదరీ సూచించారు. తామూ రైతు బిడ్డలమేనని.. వారి కోసం చివరకు ఉద్యమిస్తూనే ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications