ఢిల్లీ కాలుష్యంతో సగం చచ్చాం..ఉరిశిక్ష ఇంకేం వేస్తారు?: నిర్భయ కేసు దోషి..సుప్రీంలో రివ్యూ పిటీషన్ .
న్యూఢిల్లీ: దేశం మొత్తాన్నీ వణికించిన నిర్భయ అత్యాచారం కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్..సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తనకు విధించిన ఉరిశిక్షను సవాల్ చేశారు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

ఢిల్లీ కాలుష్యంతో సగం ప్రాణాలు పోయాయ్..
అక్షయ్ కుమార్ సింగ్ తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. దేశ రాజధానిలో వాతావరణం అత్యంత విషపూరితంగా మారిందని, ఫలితంగా- జైల్లోనే సగం ప్రాణాలు పోయాయని అక్షయ్ కుమార్ సింగ్ ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. పీల్చే గాలి, తాగే నీరు.. అంతా కాలుష్యం వల్ల తమ ప్రాణాలను హరించవేశాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షను అమలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదని చెప్పారు.

జీవిత కాలం క్షీణించిందంటూ..
ఢిల్లీ వాయుకాలుష్యం సమయంలో తమకు కనీస వసతులను కూడా కల్పించలేదని అన్నారు. ఫలితంగా- తమ జీవితకాలం క్షీణించిందని, బతికి ఉండి కూడా ఉపయోగం లేని విధంగా తయారయ్యామని చెప్పారు. ఏపీ సింగ్ దాఖలు చేసిన ఈ రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ ఎప్పుడు నిర్వహించాల్సి ఉందనేది తెలియాల్సి ఉంది. రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించకపోవచ్చంటూ మొదట్లో అభిప్రాయాలు వెలువడ్డాయి.

నిర్భయ కేసులో ఆరుమంది దోషులుగా..
2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతం.. దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అత్యంత పాశవికంగా పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుమంది కామాంధులు. వారిలో రామ్ సింగ్ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ గా తేలడంతో అతణ్ని జువైనల్ హోంలో శిక్ష విధించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ సింగ్ లకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది.












Click it and Unblock the Notifications