ఒక్కటిగా..: భారత్లో అల్ఖైదా, నవాజ్షరీఫ్ లక్ష్యమా?
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను అసమర్థునిగా చిత్రీకరించి గద్దె దించేందుకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ సంయుక్తంగా మహా కుట్రకు తెరదీశాయని, దానికి భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పి దాడులకు తెగబడటం ద్వారా పాక్ ప్రధానిపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెంచి గద్దె దిగేలా చేసేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తున్నాయని చెబుతున్నారు.
ఈ విషయాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి రీడెల్ వెల్లడించారు. షరీఫ్ను గద్దె దించేందుకు ఇమ్రాన్ ఖాన్, తాహిరుల్ ఖాద్రీ నేతృత్వంలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని దేశంలో పరిస్థితిని మరింత విషమింపచేయాలని పాక్ సైన్యం, ఐఎస్ఐ భావించాయంటున్నారు.

దీనికి ఉగ్రవాదులను అస్త్రాలుగా సంధించాయని, అల్ఖైదా చీఫ్ జవహరి వీడియో విడుదల కూడా ఇందులో భాగమేనని రీడెల్ విశ్లేషిస్తున్నారు. తాజాగా భారత ఉపఖండం కేంద్రంగా జరుగుతున్న మొత్తం పరిణామాలకు పాకిస్తాన్లో అధికార మార్పే లక్ష్యమని రీడెల్ విశ్లేషిస్తున్నారు.
గత ఏడాది భారీ మెజార్టీతో గెలుపొందిన నాటి నుంచి నవాజ్పై పాక్ సైన్యం, ఐఎస్ఐ అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో చోటుచేసుకుంటున్న ఆందోళనలు వాటికి కలిసివచ్చాయని రీడెల్ పేర్కొన్నారు. కాగా, భారత్లో తమ శాఖను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన అల్ఖైదా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇస్లాం వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు కూడా వ్యూహం పన్నినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications