అలర్ట్.. అలర్ట్.. మరో 48 గంటల్లో భారీ వర్షాలు
Recommended Video
హైదరాబాద్/ ముంబై : గత రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాస్త స్వాంతన చేకూరింది. అయితే భారత వాతావరణ శాఖ మరో తీపికబురు అందజేసింది. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలమై ఉందని .. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావారణ శాఖ అధికారులు స్పష్టంచేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంబైకర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానలు ఆగి .. కాస్త వెలుతురు రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారికి ఆ స్వాంతన ఎంతో సేపు నిలవలేదు. మరో 48 గంటల్లో ముంబైకి వాన గండం ఉందనే కబురు చెప్పింది వాతావరణ శాఖ. ముంబై మహానగరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొంది. దీంతోపాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, విదర్భ, మధ్యప్రదేవ్, నాగాలాండ్లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వర్షాలతో పాటు ఉరుములు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు, మండీ, కంగ్రా, బిలాస్పూర్, సిర్మౌర్, సోలన్, సిమ్లాలో ఉరుములు వచ్చే అవకాశం ఉందని ... రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. వర్ష ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని .. కొద్దిరోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.