బీజేపీలోకి అల్పేష్ ఠాకూర్...పావులు కదుపుతున్న మాజీ కాంగ్రెస్ నేత
గుజరాత్ : కాంగ్రెస్ను వీడిన ఆ పార్టీ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ అడుగులు బీజేపీ వైపు కదులుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్కు గత నెలలో గుడ్బై చెప్పేసిన అల్పేష్ ఠాకూర్ అతనిపై తన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. లోక్సభ ఎన్నికల్లో పటాన్ సీటు నుంచి తమ వర్గానికి చెందిన వ్యక్తికి సీటు కేటాయించాలని కోరినప్పటికీ కాంగ్రెస్ జగదీష్ ఠాకూర్ వైపు మొగ్గు చూపింది. అంతేకాదు ఠాకూర్ సేన నుంచి ఒకరికి సబర్కాంత టికెట్ ఇవ్వాల్సిందిగా చేసిన డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది.
ఇక దీనిపై పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసిన ఠాకూర్ సేన గత మంగళవారం కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు తేల్చేైసింది. అయితే తమ నిర్ణయంపై అల్పేష్ ఠాకూర్ను సంప్రదించలేదని జగత్ ఠాకూర్ తెలిపారు. ఇక సమావేశం తర్వాత తన స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాల్సిందిగా కోరుతూ 24 గంటల సమయం ఇచ్చినట్లు జగత్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్తోనే కొనసాగాలంటే ఠాకూర్ సేనలో తాను స్థానం కోల్పోవాల్సి ఉంటుందని చెప్పినట్లు జగత్ ఠాకూర్ అన్నారు. తమతో ఉండాలంటే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించారు.
లోక్సభ ఎన్నికలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయాల్లో ఠాకూర్ సేనను సంప్రదించడంలో కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని ఆరోపించారు. ఠాకూర్ సేనకు నాయకత్వం వహిస్తోంది అల్పేష్ అయినప్పటికీ వారి సమావేశంలో ఈయన లేకుండానే అన్ని నిర్ణయాలు జరిగిపోయాయి. గుజరాత్లో తన సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా ఎదిగిన అల్పేష్ ఠాకూర్ ...2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. పటాన్ జిల్లా నుంచి రాధన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు తన సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ మోసం చేస్తూ విస్మరిస్తోందని ఫిర్యాదు చేశాడు.