కరోనా విలయం: ఆగస్టు 15 జెండా పండుగకు కేంద్రం మార్గదర్శకాలు.. దేశమేమీ ఆగిపోలేదన్న మోదీ..
ఎలాంటి తారతమ్యాలు లేకుండా భారతీయులందరూ ఘనంగా జరుపుకొనే జెండా పండుగను ఈసారి కూడా స్ఫూర్తిమంతంగా నిర్వహించుకుందామంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 15న జరుగనున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు సంబంధించి కేంద్ర హోం శాఖ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగురవేసే కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరుగుతుందని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆయా జిల్లాల్లోనూ అదే సమయానికి వేడుకలు నిర్వహించాలని హోం శాఖ పేర్కొంది. ఎర్రకోట వద్ద సైనిక, పోలీసు బలగాలు మాస్కులు ధరించి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంటారని, రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో జరిగే కవాతుల్లోనూ మాస్కుల వాడకం, ఫిజికల్ డిస్టెన్స్ నియమాలను తప్పనిసరిగా ఫాలో కావాలని చెప్పింది.
ఏపీ రాజధాని మార్పు: రంగంలోకి మోదీ! - గవర్నర్కు పీఎంవో కాల్?.. ఇటు హైకోర్టూ కీలక ఆదేశాలు..
కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితర వారియర్లను, కొవిడ్ నుంచి కోలుకున్నవారిని స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. ఎక్కడ కూడా భారీగా ప్రజలు గుమ్మికూడరాదని ఆదేశించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,720 కరోనా పాజిటివ్ కేసులు, 1,129 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12.63 లక్షలకు, మొత్తం మరణాలు 30,122కు పెరిగాయి. కేసుల ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగితే ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 20లక్షలు దాటే అవకాశముంది. ఇదిలా ఉంటే..
మణిపూర్లో నీటి సరఫరా ప్రాజెక్టులకు వీడియో ద్వారా గురువారం శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. కరోనా ఎంతగా భయపెట్టాలని చూసినా దేశమేమీ ఆగిపోలేదని, వ్యాక్సిన్ వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిందేనని అన్నారు. ఓవైపు కరోనా మహమ్మారి, మరోవైపు వరదలతో ఈశాన్య రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని, అయితే, దేశమంతా మీ వెంటనే ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని మోదీ చెప్పారు. నీటి సరఫరా కేంద్రాల ఏర్పాటు మణిపూర్ మహిళలకు రాఖీ గిఫ్ట్ లాంటిదని అన్నారు.