భూ సేకరణ చట్టం: అన్నా హజారే దీక్ష, కేజ్రీవాల్ కలిసే అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే చేపట్టిన నిరసన దీక్ష ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టంకు వ్యతిరేకంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఈ నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ భూసేకరణ ఆర్డినెన్స్ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కార్పోరేట్లకు మేలు చేసేలా భూసేకరణ ఆర్డినెన్స్ ఉందన్నారు. ప్రజా స్వామ్యంలో ఓ రైతు భూమిని ప్రభుత్వం తీసుకోవాలంటే దానికి 70 శాతం మంది ప్రజలు అంగీకరించాల్సి ఉంటుందని లేదంటే ఆ విధానం చెల్లదని, ఇది పాత చట్టంలో ఉందని హజారే అన్నారు.
ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని అన్నా డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనేక వ్యవసాయ సంఘాలు, మేధాపాట్కర్ లాంటి సామాజిక కార్యకర్తలు ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా హజారే ఈ దీక్షకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
అయితే వేదికపై కాకుండా ప్రజల మధ్యలో కూర్చోని తన నిరసన తెలపాలని హజారే సూచించారు. ఇక సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అన్నా హజారే కలవనున్నారు. ఈ ధర్నాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.