కరోనా ఉప్పెన: వైరస్ కాటు: ఒక్కరోజే 1200 మందికి పైగా బలి: రెండోరోజూ అదేజోరు: 97 వేలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్.. దేశ ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. రోజూ వందలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా మరణాల సంఖ్య.. అనూహ్యంగా పెరుగుదల బాట పట్టింది. ఇదివరకు వెయ్యి లోపే నమోదవుతూ వచ్చిన కరోనా వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య.. ఈ సారి జోరందుకుంది. కొన్ని రోజుల పాటు 1100లకు పైగా రికార్డయిన కరోనా మరణాలు.. ఈ సారి 1200 మార్క్ను అధిగమించాయి. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మరోసారి దిగ్భ్రాంతిని కలిగించేలా నమోదు అయ్యాయి. లక్ష మార్క్కు మరింత దగ్గర అయ్యాయి.
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 96,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1209 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45,62,415కు చేరుకుంది. ఇప్పటిదాకా 76,271 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,43,480కి చేరుకుంది. 35,42,664 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఒక్కరోజే 1209 మంది మరణించడం ఇదే తొలిసారి.
కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువ అయ్యేలా కనిపిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 95 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం నాడు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..95,735 కేసులు నమోదు అయ్యాయి. మరో 24 గంటలు గడిచే సరికి ఈ సంఖ్య 96, 551కి చేరుకుంది. శుక్రవారం నాటి బులెటిన్ ప్రకారం.. 96,551 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో నెలకొన్న కరోనా వైరస్ తీవ్రతకు ఈ అంకెలు అద్దం పడుతున్నాయి.
Recommended Video
రాష్ట్రాల్లో అనూహ్య సంఖ్యలో పుట్టుకొస్తోన్న కొత్త కేసుల వల్ల దేశవ్యాప్తంగా లక్ష వరకు రోజువారీ లెక్కలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి గురువారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య అయిదున్నర కోట్లకు చేరువైంది. ఇప్పటిదాకా 5,40,97,975 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. గురువారం ఒక్కరోజులో 11,63,542 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.